నమస్తే తెలంగాణ క్రీడావిభాగం;వడ్డించే వాడు మనోడు అయితే బంతిలో ఎక్కడా కూర్చున్నా.. బేఫికర్ అన్నట్లు ఉంది పరిస్థితి. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ కొనసాగుతున్నది. కీలకమైన రంగాలకు నిధులివ్వకపోవడంలోనే కాదు క్రీడలపై కూడా తమ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా పథకంలో తెలంగాణకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. త్వరలో ఎన్నికలు ఉన్నాయన్న కారణమో, మరేంటో కానీ గుజరాత్పై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించింది. దేశంలో అసలు ఏ రాష్ర్టానికి లేని రీతిలో స్కీమ్ బడ్జెట్లో గుజరాత్కు 608 కోట్లు కేటాయిస్తే.. మన తెలంగాణకు 24.11 కోట్లు ఇచ్చి మమా అనిపించింది. తమ పార్టీ అధికారంలోఉన్న రాష్ర్టాలకు భారీగా నిధులు విదిల్చిన కేంద్రం..విపక్ష రాష్ర్టాలపై వివక్ష ప్రదర్శించింది. ఖేలోఇండియాలో తెలంగాణకు నిధుల కేటాయింపును మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
తెలంగాణపై వివక్ష:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఖేలో ఇండియా స్కీమ్కు రూ. 2754 కోట్లు కేటాయించారు. మొత్తం క్రీడా బడ్జెట్లో ఇది 48.09 శాతం. ఇదిలా ఉంటే ఈనెల 2న లోక్సభలో విపక్షాలకు చెందిన ఎంపీలు అరవింద్ గణపత్, సంజయ్ జాదవ్, కృపాల్ బాలాజీ, వినాయక్ రౌత్, కళాబెన్ మోహన్బాయి అడిగిన ప్రశ్నకు యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. ఇందులో వాస్తవ పరిస్థితులను చూస్తే ఖేలోఇండియా స్కీమ్ కింద బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలకు అగ్ర తాంబూలం దక్కగా, విపక్ష పార్టీలకు చెందిన రాష్ర్టాలకు అత్తెసరు నిధులు దక్కాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆఖర్లో ఎన్నికలు జరుగబోతున్న గుజరాత్కు నిధుల వరద పారింది. ఐదు ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.608 కోట్లు కేటాయించారు. గుజరాత్ తర్వాత ఉత్తరప్రదేశ్ (503 కోట్లు), అరుణాచల్ ప్రదేశ్ (183 కోట్లు), కర్ణాటక (128.52 కోట్లు) నిధులు ప్రతిపాదించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణకు 24.11 కోట్లు, ఆంధ్రపదేశ్ (33.80 కోట్లు), తమిళనాడు (33 కోట్లు), కేరళ (62.74కోట్లు) పరిస్థితి దారుణం.
ప్రాతినిధ్యం తక్కువ..పైసలు ఎక్కువ:
ఖేలోఇండియా స్కీమ్లో భారీ మొత్తంలో నిధులు పొందిన రాష్ర్టాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి. బర్మింగ్హామ్ వేదికగా తాజాగా ముగిసిన ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో సదరు రాష్ర్టాల నుంచి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. మెగాటోర్నీలో పోడియం ఫినిష్ చేసిన వారిలో ఎక్కువలో ఎక్కువ పంజాబ్, ఢిల్లీ (ఆప్ ప్రభుత్వాలు), హర్యానా (బీజేపీ) ఉండగా, భారీగా నిధులు దక్కించుకున్న గుజరాత్ నుంచి ఐదుగురు ప్లేయర్లు, ఉత్తరప్రదేశ్ (12), కర్ణాటక (11), అరుణాచల్ప్రదేశ్ (0) నుంచి ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ రీతిలో లేదు. మరోవైపు తెలంగాణ తరుపున పోటీకి దిగింది తక్కువే (6) అయినా కచ్చితంగా ఏదో ఒక పతకం తమ ఖాతాలో వేసుకుని సత్తాచాటారు.
తెలంగాణ నుంచి బరిలోకి దిగిన పీవీ సింధు(స్వర్ణం, రజతం), ఆకుల శ్రీజ(స్వర్ణం), నిఖత్ జరీన్(స్వర్ణం), సుమిత్రెడ్డి(రజతం), మహమ్మద్ హుసాముద్దీన్(రజతం), గాయత్రి గోపీచంద్(కాంస్యం) పతకాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ వేదికలపై మనోళ్లు అదరగొడుతున్నారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలైనా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్లేయర్లకు, వారి రాష్ర్టాలకు అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నది. ఖేలోఇండియాలో తెలంగాణకు నిధుల విషయంలో వివక్షపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ విమర్శించారు.
తెలంగాణ @ 2
బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెగాటోర్నీలో ఆరు పతకాలతో తెలంగాణ టాప్-2లో నిలువడంపై ప్రత్యేకంగా అభినందించారు. అద్భుత ప్రదర్శన కనబరిచిన పతక విజేతలు, వాళ్ల కోచ్లు, సహాయక బృందానికి శుభాకాంక్షలు అంటూ
కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు
విపక్షాలకు చెందిన రాష్ర్టాలకు