ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 2022 సీజన్ దారుణ పరాజయాలను మిగిల్చింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ఆ జట్టు.. ఈసారి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి తాము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా వచ్చే ఏడాది తమ తఢాఖా చూపిస్తామని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.
తాజాగా అతడు ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు. అయితే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మా జట్టులో ఒకరికోసం అందరం అన్నట్టుగా సమిష్టిగా నిలబడ్డాం. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుగా కలిసి ఆడటం గొప్ప విషయం. ఈ సీజన్ లో అది మేం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మా ఫోకస్ అంతా వచ్చే సీజన్ మీదే ఉంది..’ అని హిట్ మ్యాన్ అన్నాడు.
అంతేగాక.. ‘ఈ సీజన్ చివర్లో మేం మంచి విజయాలు అందుకున్నాం. ఈ విజయాలు మా పరిస్థితిని మార్చలేకపోవచ్చు కానీ అవి మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. వచ్చే సీజన్లో మేం మరింత బలంగా రావడానికి కావాల్సినంత ఉత్సాహాన్నిచ్చాయి.. మా జట్టు లో సమిష్టితత్వం పుష్కలంగా ఉంది. జట్టులో ఉన్నవారిలో ఒక్కరిలో కూడా ఓటమిని అంగీకరించే మనస్తత్వం లేదు. మేమంతా ఒక కుటుంబంలా నిలబడ్డాం. ట్రైనింగ్ సమయంలో మా ఆటగాళ్లు వందకు వంద శాతం కష్టపడ్డారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను.. ప్రస్తుతం మా లక్ష్యం ఒక్కటే. వచ్చే ఏడాది కప్ కొట్టడం. అందుకోసం మేం ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నాం..’ అని తెలిపాడు.
ప్రస్తుతం ముంబై జట్టులో చాలా మంది కొత్త వాళ్లేనని, ముంబై జట్టుకు వాళ్లే భవిష్యత్ అని కొనియాడాడు. తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, కుమార్ కార్తీకేయ వంటి ఆటగాళ్లంతా తొలి సీజన్ ఆడుతున్నవాళ్లే. వారిని ఉద్దేశిస్తూ.. ‘ఈ సీజన్లో కొందరు గన్ ప్లేయర్లను కనుగొన్నాం. వాళ్లు ఫ్యూచర్లో స్టార్లు అవుతారు. క్లిష్ట పరిస్థితులలో కూడా వాళ్లు చూపించిన తెగువ, ఆడిన తీరు కచ్చితంగా గర్వించదగ్గ పరిణామం..’ అని కొనియాడాడు.