మెస్సీ..మెస్సీ ఈ రెండు అక్షరాల పదంతో ప్రపంచ మొత్తం ఊగిపోతున్నది. ఆట కోసం ఈ నేలపై అడుగుపెట్టాడా అన్న రీతిలో కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన మెస్సీకి అందరూ నీరాజనం పడుతున్నారు. సుదీర్ఘ ప్రపంచకప్ ఫుట్బాల్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఫ్రాన్స్ను ఓడించిన అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. మూడున్నర దశాబ్దాల కలను సాకారం చేస్తూ మెస్సీ.. అరబ్ గడ్డపై అరుదైన చరిత్ర లిఖించాడు. దిగ్గజ మారడోనా వారసుడిగా అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ అందించిన మెస్సీకి సరిహద్దులతో సంబంధం లేకుండా యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తున్నది. మూడు పదుల వయసులోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూ కళాత్మక ఆటతీరుతో మెస్సీ మరో చరిత్ర లిఖించాడు. ఈ భూమిపై ఫుట్బాల్ బతికున్నంత కాలం మెస్సీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది.
దోహా: డీగో మారడోనా, లియోనల్ మెస్సీ ఫుట్బాల్ కోసమే ఈ భూమిపై అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. తమ వైవిధ్యమైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న వీరిద్దరు అర్జెంటీనాకే కాదు యావత్ ప్రపంచానికి హీరోలు. అవును సరిగ్గా 36 ఏండ్ల క్రితం మారడోనా అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపితే..ఆ దిగ్గజ ప్లేయర్ వారసునిగా మెస్సీ మరో చరిత్ర లిఖించాడు. విమర్శుకులకు దీటైన సమాధానం చెబుతూ 92 ఏండ్ల ఫిఫా ప్రపంచకప్లో ‘గ్రేటెస్ట్ ఎవర్ ఫైనల్’గా రికార్డుల్లోకెక్కిన ఫ్రాన్స్తో పోరులో అర్జెంటీనాను జగజ్జేతగా నిలిపాడు. లుసైల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో అదృష్టం అర్జెంటీనానే వరించింది. వరుసగా రెండోసారి కప్ను ముద్దాడుదామనుకున్న ఫ్రాన్స్ ఆశలపై మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా నీళ్లు గుమ్మరించింది.
తుదిపోరుతో కెరీర్కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్న మెస్సీకి ఎనలేని మద్దతు లభించింది. తన అద్భుత ఆటతీరుతో కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిళ్లు, అవార్డులు దక్కించుకున్న మెస్సీకి ప్రపంచకప్ వెలితిగా మిగిలిపోతుందా అని ప్రతీ అభిమాని కలవరపడిన సందర్భం. బద్ద శత్రువులు కూడా మెస్సీ గెలువాలని కోరుకున్న వైనం. మెగాటోర్నీలో ఆడకపోయినా భారత్ సహా ఫుట్బాల్తో పరిచయం ఉన్న అన్ని దేశాలు మెస్సీకి మద్దతుగా నిలిచాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఫ్రాన్స్తో ఫైనల్ పోరులో మెస్సీ ప్రాణం పెట్టి ఆడిన తీరు అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది. ఓవైపు కిలియన్ ఎంబాపె రూపంలో ఫ్రాన్స్ వీరోచితంగా పోరాడితే మరోవైపు మెస్సీ అలుపెరుగని యోధుడిలా కలల కప్ను ముద్దాడటంలో విజయవంతమయ్యాడు. మెగాటోర్నీలో ఏడు గోల్స్ కొట్టి, మరికొన్ని గోల్స్కు సహకారమందించిన మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డుతో తళుక్కున మెరిశాడు. ఈ క్రమంలో దిగ్గజాలుగా వెలుగొందుతున్న పీలే, మారడోనాల సరసన మెస్సీ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. అందుకు అరబ్ దేశం ఖతార్ వేదికైంది.
పసి ప్రాయంలోనే ఫుట్బాల్ ఆటలోకి ప్రవేశించిన లియోనల్ మెస్సీ గెలువని ట్రోఫీ లేదు, అందుకోని అవార్డు లేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ అర్జెంటీనా మేరు నగధీరుడు లెక్కకు మిక్కిలి ట్రోఫీలు, అవార్డులు అందుకున్నాడు. ఇందులో ఏడు ప్రతిష్ఠాత్మక బాలెన్ డీ ఓర్ అవార్డులతో మొదలుపెడితే 4 చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు, కోపా అమెరికా కప్ టైటిల్, 10 లా లీగా టైటిళ్లు, లీగ్-1 టైటిల్ ఇలా మెస్సీ క్యాబినెట్లో కొలువుదీరాయి. కానీ ఒక్కటే వెలితి. ఎన్నో ఏండ్లుగా అతన్ని వేధిస్తూనే వచ్చింది. 2018లో నిరాశపరిచిన అర్జెంటీనా..నాలుగేండ్ల తర్వాత ప్రపంచ విజేతగా నిలువడంలో మెస్సీది కీలక పాత్ర. అన్నీతానై జట్టును ముందుండి నడిపించిన మెస్సీ..అర్జెంటీనా వాసులకు ఆరాధ్య దైవంగా మారాడు. మూడు దశాబ్దాల కలను సాకారం చేసిన మెస్సీకి అర్జెంటీనా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్యునస్ ఎయిర్స్లో ఫుట్బాల్ అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.
ఖతార్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో రికార్డు స్థాయిలో ఏకంగా 172 గోల్స్ నమోదయ్యాయి. ఇంతకుముందు 1998, 2014 టోర్నీల్లో 171 గోల్స్ కావడమే ఇప్పటి వరకు అత్యధికం. ఖతార్ వరల్డ్కప్లో సగటున ప్రతీ మ్యాచ్లో 2.63 గోల్స్ నమోదయ్యాయి.
సరిగ్గా మూడున్నర ఏండ్ల తర్వాత అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా ఫిఫా ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. యూఎస్ నుంచి లిండా గ్రీన్ఫీల్డ్.. ఖతార్ నుంచి ఆతిథ్య హో దాను స్వీకరించింది. అమెరికాలో 11 నగరా లు, మెక్సికోలో మూడు, కెనడాలో రెండు నగరాలు మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
‘ప్రపంచకప్ టోర్నీతో కెరీర్ను ముగిద్దామనుకున్నా. ఇంతకుమించింది మరేముంటుంది. కానీ దీని తర్వాత ఇంకా ఏముందనేదే ఆలోచన. కోపా అమెరికా గెలిచాను, ఇప్పుడు ప్రపంచకప్ ముద్దాడాను. ఫుట్బాల్ అంటే ప్రేమ. జాతీయ జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. వరల్డ్ చాంపియన్గా మరికొంత కాలం అర్జెంటీనా జట్టుతో కలిసి కొనసాగాలనుకుంటున్నా.’
మెస్సీ దెబ్బకు గూగుల్లో 25 ఏండ్ల రికార్డు బద్దలైంది. అర్జెంటీనా గెలుపులో కీలకమైన మెస్సీ కోసం ప్రపంచ వ్యాప్తంగా వెతకడంతో గత 25 ఏండ్లలో ఎన్నడూ లేని ట్రాఫిక్ ఏర్పడిందని గూగుల్ సీఈవో సుందర్ పేర్కొన్నాడు.