న్యూఢిల్లీ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను బీసీసీఐ ఇంగ్లండ్కు పంపింది. భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ఏకైక టెస్టు ప్రారంభం కానుండగా.. అప్పటి వరకు రోహిత్ కోలుకోకపోతే మయాంక్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లు అందుబాటులో ఉండటంతో మొదట సెలెక్టర్లు మయాంక్ను ఈ టెస్టుకు ఎంపిక చేయలేదు. అయితే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు రాహుల్ గాయపడగా.. ఇప్పుడు రోహిత్కు కొవిడ్-19 సోకడంతో మయాంక్కు పిలుపు వచ్చింది. ‘ఇంగ్లండ్తో ఆఖరి టెస్టు కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేసింది. రోహిత్ వైరస్ బారిన పడటంతో అతడికి కవర్గా మయాంక్ను ఇంగ్లండ్ పంపాం. అతడు బర్మింగ్హామ్లో జట్టుతో కలుస్తాడు’అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.