తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ పౌసుమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో అశోక్కుమార్తో పాటు టీఆర్ఎస్కు చెందిన 9 మంది కౌన్సిలర్లు, ఎంఐఎంకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అకౌంటెంట్ ఠాకూర్ ఉష బడ్జెట్ అంశాలను చదివి వినిపించారు. బడ్జెట్ పద్దును పరిశీలించిన మున్సిపల్ ఫ్లోర్లీడర్లు, కౌన్సిలర్లు అంశాలపై సందేహాలను లేవనెత్తగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కలెక్టర్ పౌసుమిబసు సమాధానం చెప్పారు. కాలనీల్లో ఉన్న సమస్యలను కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విడుతల వారీగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కాలనీల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
వార్షిక బడ్జెట్ వివరాలు…
2020 ఏప్రిల్ 1 నాటికి అంచనా ప్రారంభ నిల్వ రూ.84.39లక్షలు
2020-2021 నాటికి అంచనా సాధారణ ఆదాయం రూ.18 కోట్ల 11 లక్షల 89 వేలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.42.55 కోట్లు
హరితహారం రూ.2 కోట్ల 70 లక్షల 54 వేలు
వేతనాలు రూ.4.45కోట్లు
పారిశుద్ధ్య నిర్వహణకు రూ. కోటి 44 లక్షల 70 వేలు
విద్యుత్ బిల్లు రూ. 38 లక్షలు
లోన్ రీపేమెంట్ రూ.38 లక్షలు
ఇంజినీరింగ్ సెక్షన్కు రూ.1 కోటి 73 లక్షలు
జనరల్ అడ్మినిస్ట్రేషన్కు రూ. కోటి 21 లక్షల 35 వేలు
టౌన్ప్లానింగ్ సెక్షన్కు రూ.24 లక్షలు
డిపాజిట్లు, అడ్వాన్స్, లోన్ రూ.2కోట్ల 10 లక్షలు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
పారిశుద్ధ్యంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పౌసుమి బసు బడ్జెట్లో సూచించారు. అందుకు పట్టణ ప్రణాళిక ల్లోంచి వెంటనే 27 ఆటోలు తీసుకురావాలని సూచించారు. బడ్జెట్లో కేటాయించిన రూ.2 కోట్ల 70 లక్షల 54 వేల నిధులతో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ముఖ్యంగా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా పాలన…
పార్టీలకు అతీతంగా మున్సిపల్లో పాలన చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు. బడ్జెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్కు సహకరించిన కౌన్సిలర్లుకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గంలోని కొందరు కౌన్సిలర్లు అనవసర ఆరోపణలు చేస్తూ బడ్జెట్ సమావేశానికి రాకపోవడం బాధాకరమన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు తలపెట్టినా ప్రజా సేవ మానుకోమన్నారు. పార్టీలకు అతీతంగా మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ శోభారాణి మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతో తాండూరు అభివృద్ధికి కొంతమంది కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఫ్లోర్లీడర్ సాజీద్అలీ మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా బాగుందన్నారు.