దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాథ్యూ హేడెన్ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నాడు. అయితే ఆదివారం జరిగే హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్పై హేడెన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇండియన్ జట్టులోని ఓ బ్యాటర్ వల్ల పాకిస్థాన్కు ప్రమాదం ఉందని హేడెన్ అంచనా వేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ చాలా కీలకమైన ఆటగాడు అని, చిన్నతనం నుంచి రాహుల్ క్రికెట్ ఆడుతున్న వైనాన్ని గమనించానని, షార్ట్ ఫార్మాట్లో అతని ఆధిపత్యం అమోఘంగా ఉందని హేడెన్ అన్నాడు. కేఎల్ రాహుల్ వల్ల పాకిస్థాన్కు ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పాడు. ఇక కీపర్ రిషబ్ పంత్ కూడా కీలకమే అన్నాడు. బలమైన బౌలింగ్ అటాక్ను కూడా రిషబ్ చిత్తు చేస్తాడని హేడెన్ తెలిపాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లను కట్టడి చేస్తే పాకిస్థాన్కు విజయం దక్కుతుందన్నాడు.
ఇదొక్క విషయమే కాదు, ఇండోపాక్ మ్యాచ్ అంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో.. సారథ్య బాధ్యతలు చాలా కీలకమైన అంశమని కూడా హేడెన్ తెలిపాడు. ధోనీ, మోర్గన్లు అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం వల్లే.. ఐపీఎల్ ఫైనల్కు ప్రవేశించినట్లు చెప్పాడు. నిజానికి వ్యక్తిగతంగా ఆ ఇద్దరి పర్ఫార్మెన్స్ సరిగా లేదని, కానీ తమ జట్లను వాళ్లు నడిపించిన విధానం విశేషమైందన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చాలా నైపుణ్యమైన కెప్టెన్సీని ప్రదర్శిస్తే, అప్పుడు ఆ జట్టుకు విజయం చేకూరుతుందని హేడెన్ అభిప్రాయపడ్డాడు.