Mark Boucher : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్స్ పుట్టుకొచ్చాయి. ఇంటర్నేషనల్ టీ20 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL), లంక ప్రీమియర్ లీగ్(LPL) అని చాలా జరుగుతున్నాయి. వాటిలో ఒకటైన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్ ఈ మధ్యే మొదలైంది. ఈ సమయంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్(Mark Boucher) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గడ్డపై ఎస్ఏటీ20 లీగ్ జరిగే చాన్స్ ఉందని అన్నాడు.
‘ఇండియాలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిర్వహించడం నిజంగా గొప్ప ఆలోచన. ఆ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే.. 2009లో ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. బీసీసీఐ లెక్కనే మేము కూడా చేయాలని అనుకుంటున్నాం. పైగా రెండు దేశాల మధ్య అనుబంధం ఉంది. భారత గడ్డపై ఎదురయ్యే సవాళ్లు భిన్నమైనవి. అయితే.. ఈ ఆలోచనపై ఎస్ఏటీ20 కమిషనర్ గ్రేమ్ స్మిత్(Greamae Smith) వర్కవుట్ చేస్తాడని నమ్ముతున్నా’ అని బౌచర్ తెలిపాడు.
మార్క్ బౌచర్
ఐపీఎల్ రెండో ఎడిషన్కు భద్రతా కల్పించలేమని అన్ని రాష్ట్రాలు చేతులెత్తేశాయి. దాంతో, బీసీసీఐ ఈ లీగ్ను సఫారీ గడ్డపై నిర్వహించింది. ఈ సీజన్లో దక్కన్ చార్జర్స్(Deccan Chargers) విజేతగా అవతరించింది. టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఐపీఎల్ ట్రోఫీతో దక్కన్ చార్జర్స్ జట్టు
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ నిరుడు జనవరిలో ప్రారంభమైంది. టైటిల్ కోసం మొత్తం ఆరుజట్లు పోటీపడగా మర్క్రమ్ సారథ్యంలోని సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు విజేతగా నిలిచింది. తొలి సీజన్ సక్సెస్తో నిర్వాహకులు రెండో సీజన్ ఈ మధ్యే ఘనంగా మొదలెట్టారు. మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్ కూడా మార్చి చివర్లో షురూ కానుంది.