Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్లో కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ (Manu Bhaker) తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంది. తాజాగా జరుగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నిక(Haryana Assembly Elections)ల్లో ఆమె ఓటు వేసింది. ఝాజ్జర్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేసిన మను సంతోషం వ్యక్తం చేసింది. మొదటిసారి ఓటు వేసినందుకు చాలా ఆనందంగా ఉందని స్టార్ షూటర్ తెలిపింది.
విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనకు గౌరవంగా ఈమధ్యే ‘యూత్ ఐకాన్’గా నియమితురాలైన మను ఓటేసి అందరికి స్ఫూర్తిగా నిలిచింది. క్యూలో నిలబడి మరీ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె తన ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న సిరాను చూపిస్తూ మీడియాతో మాట్లాడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | On casting her first vote, Olympic medalist Manu Bhaker says, “Being the youth of this country, it is our responsibility to cast our vote for the most favourable candidate. Small steps lead to big goals… I voted for the first time…” https://t.co/806sYLcpoe pic.twitter.com/vQ5j4m7fFB
— ANI (@ANI) October 5, 2024
‘ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ఈ దేశపు యువతరం అయిన మనందరి బాధ్యత. అంతేకాదు మంచి నాయకుడిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఇక అభివృద్ధి విషయానికొస్తే.. మనం ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది చాలా ప్రధానం. అందుకని ఎవరిని గెలిపించాలి? అనేది మన చేతుల్లోనే ఉంది. సదరు నాయకుడు నాయకురాలు మనం అనుకున్న పనులు చేస్తారా? అనేది ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే చిన్న చిన్న అడుగులే పెద్ద లక్ష్యాన్ని చేరవేస్తాయి. నేను ఓటు వేయడం ఇదే ప్రథమం’ అని మను భాకర్ వెల్లడించింది.
పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ పతక బోణీతో దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో సత్తా చాటిన ఆమె కంచు మోత మోగించింది. మొదట వ్యక్తిగత విభాగంలో అదిరే గురితో కాంస్యం గెలిచిన మను.. అనంతరం సరబ్జోత్ సింగ్(Sarabhjot Singh)తో కలిసి దేశానికి రెండో పతకం అందించింది. తద్వారా ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత షూటర్గా మను చరిత్ర సృష్టించింది.