ఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో చోటు కోల్పోయిన స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా.. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్ నుంచి తానేమీ ప్రత్యేక సదుపాయాలు కోరలేదని, తనను ఎంపికచేయకపోవడానికి గల కారణాలను సహేతుకంగా వివరించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ మేరకు బహిరంగ లేఖలో విడుదల చేసింది.
‘ఆసియా గేమ్స్కు నన్ను ఎంపిక చేయాలని, నేను ప్రత్యేక సదుపాయాలు కోరానని నామీద ప్రచారం జరుగుతున్నది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నన్ను ఎంపిక చేయాలని నేనెవరినీ కోరలేదు. అలాగే నేనేమీ స్పెషల్ ట్రీట్మెంట్ ఆశించలేదు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలని కూడా నేను కోరటం లేదు. కానీ నా ప్రశ్నలకు సమాధానమివ్వండి. మీరిచ్చే జవాబు (ఆసియా క్రీడల్లో ఎంపికపై)తో నేను సంతృప్తి చెందకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికీ వెనుకాడను’ అని లేఖలో పేర్కొంది. నేషనల్స్ ఆడలేదనే కారణంతో మనికాపై సెలక్టర్లు వేటు వేసిన విషయం తెలిసిందే.