భారత్ తొలి ఇన్నింగ్స్ 132/1.. ఆస్ట్రేలియాతో ఏకైక గులాబీ టెస్టు
గోల్డ్కోస్ట్: స్టార్ ఓపెనర్ స్మృతి మందన (80 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్సర్) దంచి కొట్టడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు (డే అండ్ నైట్)లో భారత్ మహిళల జట్టుకు శుభారంభం దక్కింది. వర్షం కారణంగా దాదాపు రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయిన పోరులో తొలి రోజు ఆట నిలిచిపోయే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. మందనతో పాటు మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్కు 93 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. తమ క్రికెట్ చరిత్రలోనే తొలి పింక్ టెస్టు ఆడుతున్న మన అమ్మాయిలు ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ సాగించారు. ముఖ్యంగా మందన.. ఆఫ్సైడ్ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ అభిమానులను అలరించింది. ప్రస్తుతం స్మృతితో పాటు పూనమ్ రౌత్ (16 నాటౌట్) క్రీజులో ఉంది. భారత జట్టు 15 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు ఆడుతుండగా.. ఇప్పటివరకు టెస్టు ఫార్మాట్లో కంగారూలను ఓడించని మనవాళ్లకు ఇది సదావకాశంలా కనిపిస్తున్నది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 132/1 (మందన 80 నాటౌట్; షఫాలి 31; సోఫియా 1/18)