ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం మహిళా క్రికెటర్ల వేలం నిర్వహించిన మల్లికా సాగర్పై క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు. భారతదేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఆటగాళ్ల వేలం నిర్వహించింది. సోమవారం జరిగిన వేలంలో మొత్తం 87 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే వేలం వేసిన మల్లికా సాగర్ ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఆమె వేలం నిర్వహించిన తీరు క్రికెటర్లను విశేషంగా ఆకట్టుకున్నది. ఆక్షన్ జరిగిన తీరును దినేశ్ కార్తీక్ మెచ్చుకున్నాడు. తన ట్విట్టర్లో మల్లికా సాగర్పై ప్రశంసలు కురిపించాడు.
మల్లికా సాగర్ అద్భుతమైన రీతిలో వేలం నిర్వహించారని, ఆమె చాలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా, ఎంతో నేర్పుతో క్రికెటర్ల వేలం నిర్వహించినట్లు తన ట్వీట్లో దినేశ్ తెలిపాడు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించిన బీసీసీకి కూడా కార్తీక్ తన ట్వీట్లో మెచ్చుకున్నాడు.
MALLIKA SAGAR is a terrific auctioneer
Confident , clear and very poised .
Straight away the right choices in the WPL
Well done @BCCI #WPLAuction #WPL2023
— DK (@DineshKarthik) February 13, 2023
ఇక ఆ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన జాక్పాట్ కొట్టింది. డబ్ల్యూపీఎల్ వేలంలో స్మృతికి భారీ ధర పలికింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ ఓపెనర్ కోసం రూ. 3.40 కోట్లు వెచ్చించింది. స్మృతి కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరకు ఆర్సీబీ దక్కించుకుంది. మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న డబ్ల్యూపీఎల్ కోసం సోమవారం ముంబై వేదికగా వేలం జరుగగా.. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 87 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. ఫ్రాంచైజీలన్నీ భారత ప్లేయర్లను దక్కించుకునేందుకు ఎక్కువ పోటీపడగా.. విదేశీ ప్లేయర్లలో ఆష్ల్లే గార్డ్నర్, నటాలియా స్కీవర్కు భారీ ధర దక్కింది.
ముంబై ఇండియన్స్ జట్టు స్కీవర్ కోసం రూ. 3.20 కోట్లు వెచ్చించింది. ఈ వేలంలో 10 మంది భారత ప్లేయర్లు కోటి రూపాయల మార్క్ దాటారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకోగా.. వరల్డ్కప్లో దాయాది పాకిస్థాన్పై దంచికొట్టిన జెమీమా రోడ్రిగ్స్ పంట పండింది. రోడ్రిగ్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లు వెచ్చించింది. యువ ఓపెనర్, అండర్-19 ప్రపంచకప్ విజేత షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసుకుంది.