Maheesh Theekshana : ఆసియాకప్ 2023 వేదికలు ఖరారు కావడంతో వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఈ మెగా టోర్నమెంట్కు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో.. శ్రీలంక స్పిన్నర్ మహీశ్ థీక్షణ(Maheesh Theekshana) ఆసక్తికకర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వరల్డ్ కప్ గెలిచేది తమ జట్టేనని, అందులో ఏమాత్రం అనుమానం లేదని ఈ యంగ్స్టర్ చెప్పాడు.
1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టును స్ఫూర్తిగా తీసుకొని తాము ఈసారి వరల్డ్ కప్ గెలుస్తామని అతను అన్నాడు. ‘1996లో శ్రీలంక జట్టు వరల్డ్ కప్ విజేతగా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, మా జట్టు కప్పు కొట్టింది. ఈసారి ప్రస్తుత జట్టు వరల్డ్ కప్ గెలవాల్సిన సమయం వచ్చింది’ అని థీక్షణ తెలిపాడు.
వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్లో ఆఖరి రెండు స్థానాలు మిగిలాయంతే. ఒకప్పటి చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక ఆ రెండు స్థానాలు దక్కించుకునేందుకు పసికూనలతో పోటీ పడుతున్నాయి. జూన్ 18న జింబాబ్వేలో జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచులపైనే ఆ శ్రీలంక టీమ్ ఆశలన్నీపెట్టుకుంది. ఈఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్లో జరగనుంది. 2011లో సొంత గడ్డపై టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీని దక్కించుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఎస్.ధోనీ (91 నాటౌట్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) సిక్స్ కొట్టడంతో భారత జట్టు చాంపియన్గా అవతరించింది.
క్వాలిఫైయర్ 1 పోరులో హార్దిక్ పాండ్యా వికెట్ తీసిన థీక్షణ
ఐపీఎల్ 16వ సీజన్లో థీక్షణ సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన ఈ యంగ్స్టర్ 9 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. క్వాలిఫైయర్ 1 పోరులో అతడు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్లతో మెరిశాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్లో రవీంద్ర జడేజా(11 నాటౌట్) చెన్నైని గెలిపించాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి కప్పు అందించాడు. దాంతో, ధోనీ సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.