Rohit Sharma | వన్డే వరల్డ్ కప్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. ముంబై – పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు గాను రోహిత్పై పోలీసులు కొరడా ఝుళిపించారు. ముంబై – పూణే హైవేపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడనే కారణంతో హిట్మ్యాన్పై మూడు ట్రాఫిక్ చలాన్లు విధించినట్టు పోలీసులు వెల్లడించారు.
లోక్మత్ టైమ్స్లో వచ్చిన కథనం మేరకు.. ముంబై నుంచి పూణేకు వెళ్తుండగా గంటకు రెండు వందల నుంచి 215 కిలోమీటర్ల వేగంతో రోహిత్ తన లంబూర్గిని కారును నడిపినందుకు గాను అతడిపై మూడు చలాన్లు విధించినట్టు మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇదే విషయమై ఓ ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘వరల్డ్ కప్ జరుగుతుండగా టీమిండియా సారథి ఇంత వేగంగా కారును నడపడం సముచితం కాదు. అతడు కారులో కంటే టీమ్ బస్లోనే ప్రయాణిస్తే బాగుండేది..’ అని చెప్పాడు.
గత శనివారం అహ్మదాబాద్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ తర్వాత రోహిత్ హెలిక్యాప్టర్లో ముంబైకి చేరుకున్నాడు. రెండురోజుల పాటు కుటుంబంతో గడిపిన హిట్మ్యాన్.. మంగళవారం పూణేలో ఉన్న టీమిండియాతో కలిశాడు. ముంబై నుంచి పూణేకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా పోలీసులు.. రోహిత్ కారుకు ట్రాఫిక్ చలాన్లు విధించారు.
ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్లో విఫలమైన రోహిత్.. తర్వాత అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా సెంచరీకి దగ్గరగా వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో కూడా రోహిత్ రాణించాలని టీమిండియా కోరుకుంటోంది.