12 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో రింకూ సింగ్ విశ్వరూపం చూపినా.. కోల్కతాను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. మరో బ్యాటర్ లేకపోవడంతో బాధ్యతనంతా భుజాన వేసుకున్న ఈ కుర్రాడు.. రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు రాబట్టి లక్నోను భయపెట్టినా.. ఉత్కంఠను అధిగమించి విజయం సాధించిన సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.
కోల్కతా: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో లక్నోను విజయం వరించింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక పరుగు తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ధనాధన్ అర్ధశతకంతో చెలరేగగా.. క్వింటన్ డికాక్ (28), ప్రేరక్ (26), ఆయుష్ బదోనీ (25) పర్వాలేదనిపించారు.
కోల్కతా బౌలర్లలో నరైన్, శార్దూల్, వైభవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులకు పరిమితమైంది. రింకూ సింగ్ (33 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా.. జట్టును గెలిపించలేకపోయాడు. జాసన్ రాయ్ (45) రాణించాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. పూరన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 176/8 (పూరన్ 58; డికాక్ 28; శార్దూల్ 2/27, నరైన్ 2/28), కోల్కతా: 175/7 (రింకూ 67*, రాయ్ 45; బిష్ణోయ్ 2/23, యష్ 2/31).