Lionel Messi | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ చివరి అంకానికి చేరింది. ఆదివారం జరగనున్న తుది పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ప్రస్తుతం అందరి కళ్లూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీపైనే ఉన్నాయి. అద్భుతమైన ఆటతీరుతో జట్టును కప్ ముంగిట నిలిపినన మెస్సీ.. ఫైనల్లో ఎలా ఆడతాడన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు వరల్డ్ కప్ను ముద్దాడి ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని మెస్సీ భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఓ వార్త అర్జెంటీనాను కలవరానికి గురి చేస్తోంది.
ఫైనల్ ముంగిట మెస్సీ గాయపడ్డాడన్న వార్తలు ఆ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. క్రొయేషియాతో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మెస్సీకి గాయాలైనట్లు సమాచారం. గాయాల కారణంగా గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు సైతం మెస్సీ గైర్హాజరైనట్లు తెలుస్తోంది. గాయం బాధించడంతో మెస్సీ తుదిపోరుకు దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. మెస్సీతోపాటు స్టార్ ఆటగాడైన గోమెజ్కు కూడా గాయమైందని.. అతడు కూడా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని సమాచారం. వీరిద్దరూ చివరి మ్యాచ్లో ఆడేది డౌటే అని పలు వెబ్సైట్లలో వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.