మనీలా: ఆల్టైమ్ గ్రేట్ బాక్సర్లలో ఒకడు, లెజెండరీ బాక్సర్ మ్యానీ పకియావో( Manny Pacquiao ) తన రెండున్నర దశాబ్దాల బాక్సింగ్ కెరీర్కు ముగింపు పలికాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ఓ ట్వీట్ వీడియోలో అతడు ప్రకటించాడు. 2022లో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన 42 ఏళ్ల పకియావో.. ఆ దిశగా అడుగులు వేయడానికి బాక్సింగ్కు వీడ్కోలు పలికాడు. ఓ బాక్సర్గా నా సమయం అయిపోయిందని చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఇవాళ నేను నా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని పకియావో చెప్పాడు.
కొన్ని వారాల కిందట తన చివరి ప్రొఫెషనల్ ఫైట్లో క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్తో తలపడి ఓడిపోయాడు. 2010లోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. ప్రస్తుతం సెనేటర్గా ఉన్నాడు. తాను వచ్చే ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవి బరిలో దిగనున్నట్లు గత వారమే పకియావో ప్రకటించాడు. తన పేదరికాన్ని పారదోలిన బాక్సింగ్కు గుడ్బై చెప్పడం చాలా బాధగా ఉన్నదని రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా పకియావో అన్నాడు.
స్కూల్ డ్రాపౌట్ ఇప్పుడిలా..
పకియావో తన 14 ఏళ్ల వయసులో అర్ధంతరంగా స్కూల్ మానేయాల్సి వచ్చింది. తన తల్లి, ఇద్దరు తోబుట్టువుల బాగోగులు చూసుకోవడానికి అతడు ఈ పని చేశాడు. రోడ్లపై డోనట్స్ అమ్మాడు. తర్వత మెల్లగా బాక్సింగ్ వైపు అడుగులు వేసిన పకియావో.. కొన్నేళ్లలోనే ప్రొఫెషనల్ బాక్సర్గా ఎదిగాడు. తన 26 ఏళ్ల కెరీర్లో 62 విజయాలు సాధించి, 8 బౌట్లలో ఓడిపోయాడు. ఫిలిప్పీన్స్లో ఎంతో మందికి అతడు ఆరాధ్య బాక్సర్.
పకియావో రింగులో తలపడుతున్నాడంటే రోడ్లపై ట్రాఫిక్ ఆగిపోయేది. దేశంలో నేరాలు తగ్గిపోయేవి. అంతటి బాక్సర్ ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దేశంలోని పేదరికం, అవినీతిని అంతమొందించడమే తన లక్ష్యమని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లే ముందు పకియావో చెబుతున్నాడు. అయితే అతని గెలుపు మాత్రం అంత సులువు కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.