యిసో(కొరియా): కొరియా ఓపెన్ సూపర్-500 టోర్నీలో స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న సింధు..కొరియా ఓపెన్లోనూ ఆకట్టుకోలేకపోయింది. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 18-21, 21-10, 13-21 తేడాతో పై యు పో(చైనీస్ తైపీ) చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొంది. దాదాపు గంటసేపు జరిగిన పోరులో 22వ ర్యాంకర్కు దీటైన పోటీనివ్వడంలో సింధు విఫలమైంది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-12, 22-24, 17-21తో కెంటో మెమొటా(జపాన్) చేతిలో ఓడిపోయాడు. జపాన్ షట్లర్పై శ్రీకాంత్కు ఇది వరుసగా 12వ ఓటమి. మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్ 21-13, 21-17తో జులియన్ కార్గీ(బెల్జియం)పై గెలిచి ముందంజ వేశాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జోడీ ముందంజ వేసింది.