ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార్లు గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఈ క్రమంలో కోహ్లీ బుర్ర వేడెక్కిపోయిందని, అతనికి కొంత విశ్రాంతి అవసరమని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఇదే విషయాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా ప్రస్తావించాడు. అయితే ఆ సమయంలో కామెంటరీ బాక్సులోనే ఉన్న దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఒక ప్రశ్న అడిగాడు. ‘‘కోహ్లీకి విశ్రాంతి కావాలన్న రవిశాస్త్రి.. రోహిత్ విషయంలో కూడా అదే మాట చెప్తారా?’’ అని అడిగాడు.
ఈ సీజన్లో రోహిత్ కూడా పేలవ ఫామ్లోనే ఉన్నాడు. 11 మ్యాచులు ఆడిన రోహిత్ 18.18 సగటుతో కేవలం 200 పరుగులే చేశాడు. వీళ్లిద్దరూ ఫామ్లో లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులంతా టెన్షన్ పడిపోతున్నారు. దీనిపై మాట్లాడిన హేడెన్.. వీళ్లిద్దరూ ఎడతెగని క్రికెట్ ఆడుతూ వస్తున్నారని, ఇద్దరూ ఒకే కారణంతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.