ఉత్కంఠతో మునివేళ్లపై నిల్చోవడం అంటే ఏంటో.. ఒత్తిడిలో నరాలు తెగడం అంటే ఎలా ఉంటుందో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసినవాళ్లనడిగితే సరిగ్గా అర్థమై ఉంటుంది. బంతి బంతికి విజయం దోబూచులాడుతున్న తరుణాన విరాట్ కోహ్లీ తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని మేల్కొలపడంతో టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయ దుందుభి మోగించింది. థౌజెండ్ వాలా వంటి సిక్సర్లు.. రాకెట్ల లాంటి ఫోర్లతో మెల్బోర్న్ మైదానాన్ని హోరెత్తించిన విరాట్.. అభిమానులకు ముందస్తు దివాళీ సంబురాలందించాడు.
మెల్బోర్న్: చేజింగ్ మాస్టర్, రన్ మెషీన్, కింగ్ ఆఫ్ క్రికెట్, అభినవ సచిన్.. ఇలా తన పేరు ముందు వందలాది ఉపమానాలు ఎందుకు ఉపయోగిస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత ఉన్నా.. కోహ్లీ క్రీజులో ఉంటే భారత అభిమానులంతా గుండె నిబ్బరంతో ఎందుకు ఉంటారో తేటతెల్లం చేశాడు. ఉత్కంఠ ఊపేసిన పోరులో విరాట్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో దాయాది పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసి మెగా టోర్నీలో శుభారంభం చేసింది. నిరుడు యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో పాక్ చేతిలో పరాజయం పాలైన భారత్.. ఆ ఓటమికి ఘనంగా బదులు తీర్చుకుంది. 90 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తిఖార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4)తో పాటు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్శ్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడగా.. హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరినా.. కడవరకు క్రీజులో నిలిచిన కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవుఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విరాట్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. టీమ్ఇండియా తమ తదుపరి మ్యాచ్లో గురువారం నెదర్లాండ్స్తో తలపడనుంది.
31/4 నుంచి 144/4 వరకు
సవాలు విసిరే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. నిరుటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో అతి జాగ్రత్తకు పోయిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (4), లోకేశ్ రాహుల్ (4) వెంట వెంటనే ఔటయ్యారు. షాహీన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్ను ఆచితూచి కాచుకున్న రాహుల్.. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని ఔట్ కాగా.. రవుఫ్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి హిట్మ్యాన్ వెనుదిరిగాడు. క్రీజులో అడుగుపెట్టిన వెంటనే కొన్ని చక్కటి షాట్లతో అలరించిన సూర్యకుమార్ (15) కూడా ఎక్కువసేపు నిలువలేకపోగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ (2) రనౌట్గా పెవిలియన్ బాట పట్టాడు.
దీంతో టీమ్ఇండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్యాతో కలిసి విరాట్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో పరుగుల రాక కష్టమైంది. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 45/4తో నిలిచింది. క్రీజులో కుదురుకున్న తర్వాత ఈ జోడీ బ్యాట్లకు పనిచెప్పింది. నవాజ్ వేసిన 12వ ఓవర్లో హార్దిక్ రెండు సిక్సర్లు అరుసుకోగా.. కోహ్లీ కూడా ఓ సిక్సర్ బాదాడు. అక్కడి నుంచి అడపా దడపా బౌండ్రీలతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టిన ఈ జోడీ లక్ష్యాన్ని కరిగించింది.
అర్శ్దీప్ అదుర్స్
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు కూడా శుభారంభం దక్కలేదు. ఇటీవలి కాలంలో ఆ జట్టు అధికంగా ఆధారపడుతున్న ఓపెనర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అర్శ్దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే బాబర్ వికెట్ల ముందు దొరికిపోగా.. అర్శ్దీప్ తదుపరి ఓవర్లో పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రిజ్వాన్ బౌండ్రీలైన్ వద్ద క్యాచౌటయ్యాడు. దీంతో కాస్త ఒత్తిడిలో పడ్డ పాక్.. ఆ తర్వాత ఇఫ్తిఖార్, మసూద్ పోరాటంతో తేరుకుంది.
మసూద్ కాస్త నిధానంగా ఆడగా.. ఇఫ్తిఖార్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అక్షర్ వేసిన 12వ ఓవర్లో ఇఫ్తిఖార్ మూడు సిక్సర్లు అరుసుకోవడంతో పాక్ భారీ స్కోరు దిశగా సాగింది. అయితే సరైన సమయంలో కెప్టెన్ రోహిత్.. షమీకి బంతి అందివ్వగా.. జోరు మీదున్న ఇఫ్తిఖార్ను అతడు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బంతితో మ్యాజిక్ చేశాడు. రెండు ఓవర్లలో షాదాబ్, హైదర్ అలీతో పాటు నవాజ్ను పెవిలియన్ పంపాడు. ఆఖర్లో షాహీన్ షా (16) కొన్ని షాట్లు ఆడటంతో పాక్ మంచి స్కోరు చేయగలిగింది.
ఆ మూడు ఓవర్లు..
టీమ్ఇండియా విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు అవసరం కావడంతో.. రోహిత్ సేన గట్టెక్కడం కష్టమే అనిపించింది. ఈ దశలో షాహీన్ వేసిన 18 ఓవర్లో తన క్లాస్ ఆట బయటపెట్టిన కోహ్లీ మూడు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 12 బంతుల్లో 31కి చేరింది. 19వ ఓవర్ వేసిన రవుఫ్ తొలి నాలుగు బంతుల్లో కేవలం మూడే పరుగులు ఇవ్వడంతో భారత్ విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్లిష్ట స్థితిలో ఐదో బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టిన విరాట్.. ఆఖరి బంతిని ఫైన్ లెగ్ దిశగా ప్రేక్షకుల్లో పడేశాడు. దీంతో కాస్త ఉపశమనం లభించగా.. చివరి ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. దీంతో 5 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. రెండో బాల్కు కార్తీక్ సింగిల్ తీసి విరాట్కు స్ట్రయిక్ ఇచ్చాడు.
మూడో బంతికి రెండు పరుగులు రాగా.. నవాజ్ వేసిన నాలుగో బంతిని డీప్ స్కేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ అరుసుకున్నాడు. అది నోబాల్ కావడంతో భారత్కు ఫ్రీ హిట్ లభించగా.. దానికి వైడ్తో కలుపుకొని మొత్తం నాలుగు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. ఐదో బాల్కు దినేశ్ కార్తీక్ (1) స్టంపౌడయ్యాడు. ఆ తర్వాత నవాజ్ వైడ్ వేయడంతో స్కోర్లు సమం కాగా.. చివరి బంతికి అశ్విన్ (1 నాటౌట్) లాంగాఫ్ దిశగా సింగిల్ తీయడంతో భారత్ విజయ ఢంకా మోగించింది. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ.. చివరి 33 బంతుల్లో 71 పరుగులు సాధించడం గమనార్హం.
18 లక్ష్యఛేదనలో విరాట్ కోహీ ్ల నాటౌట్గా నిలిచిన 18 మ్యాచ్ల్లోనూ భారత్ విజయ తీరాలకు చేరింది. ప్రపంచ క్రికెట్లో మరే క్రికెటర్ ఇలాంటి ఘనత సాధించలేదు.
81.33 పొట్టి ఫార్మాట్లో పాకిస్థాన్పై కోహ్లీ సగటు. ఒక ఆటగాడికి ఏ జట్టుపైనైనా ఇదే అత్యధికం. పాక్తో 10 ఇన్నింగ్స్ల్లో విరాట్ 488 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, 4 ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ (3794) నిలిచాడు. రోహిత్ శర్మ (3741) రెండో స్థానంలో ఉన్నాడు.
1 ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 39 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే అత్యధికం. 2003లో ఆస్ట్రేలియా 38 విజయాలతో రెండో స్థానంలో ఉంది.
48 లక్ష్యఛేదనలో చివరి మూడు ఓవర్లలో టీమ్ఇండియా సాధించిన అత్యధిక పరుగులివే.
5 టీ20 ప్రపంచకప్లో చివరి బంతికి ఫలితం తేలడం ఇది ఐదోసారి. ఓవరాల్గా ఇలా నెగ్గడం టీమ్ఇండియాకు ఇది నాలుగోసారి.
విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కేవలం అతడి వ్యక్తిగతంగానేకాక, భారత్కే అత్యుత్తమ ఇన్నింగ్స్. 13వ ఓవర్ వరకు విజయావకాశాలు అంతంత మాత్రంగానే కనిపించాయి. అయితే విరాట్ విజృంభించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. పాండ్యాతో పార్ట్నర్షిప్ జట్టును గెలిపించింది. ఒత్తిడిలో బ్యాటింగ్ చేయడంలో అతడిని మించిన వాళ్లు లేరు.
-రోహిత్, భారత కెప్టెన్
స్కోరు బోర్డు
పాకిస్థాన్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్శ్దీప్ 4, బాబర్ (ఎల్బీ) అర్శ్దీప్ 0, మసూద్ (నాటౌట్) 52, ఇఫ్తిఖార్ (ఎల్బీ) షమీ 51, షాదాబ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 5, హైదర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 2, నవాజ్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 9, ఆసిఫ్ (సి) కార్తీక్ (బి) అర్శ్దీప్ 2, షాహీన్ (సి అండ్ బి) భువనేశ్వర్ 16, రవుఫ్ (నాటౌట్) 6, ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 159/8. వికెట్ల పతనం: 1-1, 2-15, 3-91, 4-96, 5-98, 6-115, 7-120, 8-151, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-22-1, అర్శ్దీప్ 4-0-32-3, షమీ 4-0-25-1, పాండ్యా 4-0-30-3, అశ్విన్ 3-0-23-0, అక్షర్ 1-0-21-0.
భారత్: రాహుల్ (బి) నసీమ్ షా 4, రోహిత్ (సి) ఇఫ్తిఖార్ (బి) రవుఫ్ 4, కోహ్లీ (నాటౌట్) 82, సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) రవుఫ్ 15, అక్షర్ (రనౌట్) 2, పాండ్యా (సి) బాబర్ (బి) నవాజ్ 40, కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1, అశ్విన్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 160/6. వికెట్ల పతనం: 1-7, 2-10, 3-26, 4-31, 5-144, 6-158, బౌలింగ్: షాహీన్ షా అఫ్రిది 4-0-34-0, నసీమ్ సా 4-0-23-1, రవుఫ్ 4-0-36-2, షాదాబ్ 4-0-21-0, నవాజ్ 4-0-42-2.
A packed MCG chanting for Virat Kohli 🏟
Raw vision: Behind the scenes of India’s sensational win 📹
Goosebumps. #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MNjmOLKO7r
— ICC (@ICC) October 23, 2022