హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ప్రాచీన కాలంనాటి డైక్లు బయల్పడ్డాయి. మున్నేరువాగుకు తూర్పున దానవాయిగూడెం సమీపంలోని పరుపుబండపై వీటిని గుర్తించారు. ఇవి దాదాపు 360 కోట్ల సంవత్సరాలనాటివని పరిశోధకుల అంచనా. ఖమ్మం పట్టణానికి చెందిన చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైనప్పుడు ఈ డైక్లను గుర్తించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దానవాయిగూడెం పార్కుకు వెళ్లే మార్గంలో రైల్వేలైను పక్కన ఉన్న విశాలమైన రాతి పరుపు బండపై నల్లటి గీతల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. భూ భౌతిక విజ్ఞానశాస్త్ర (జియాలజీ) పరిభాషలో వీటిని డైక్లు అంటారు. ఈ గీతలను చూసి స్థానికులు ఈ బండను పాములబండ అనే పేరుతో పిలుస్తారు. ఈ బండపై డైక్లను గుర్తించిన అనంతరం వాటి వివరాల గురించి శ్రీనివాస్ జియాలజిస్టులతో చర్చించారు. ఇవి 17.14.30 ఉత్తర అక్షాంశం, 80.10.32 తూర్పు రేఖాంశం ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ గీతలు 11 నుంచి 13 అంగుళాల మందంతో నాలుగు ముక్కలుగా తూర్పు, పడమర దిశల్లో ఉన్నాయి. వీటిని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన నిర్మాణాలుగా పరిశోధకులు చెప్తున్నారు.
భూమి లోపలి పొరల్లోని మాగ్మా (శిలాద్రవం) భూగర్భంలో ఏర్పడే వివిధ మార్పుల వల్ల బయటికి ప్రవహించి రాతి పగుళ్లమధ్యకు ప్రవేశించడం ద్వారా ఇటువంటి నిర్మాణాలు ఏర్పడతాయంటున్నారు. నాగపూర్కు చెందిన జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ తుషార్ మేస్రమ్ గతంలోనే ఖమ్మంలోని వివిధ డైక్లపై పరిశోధన నిర్వహించి తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. మాగ్మా ప్రవాహం వల్ల లేదంటే శైథిల్యం వల్ల రెండు రకాలుగా డైక్ రెండు రకాలుగా ఏర్పడుతుందని, ఖమ్మంలో గుర్తించిన డైక్ల వయసు సుమారు 360 కోట్ల నుంచి 380 కోట్ల సంవత్సరాలు ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన చకిలం వేణుగోపాల్, సౌరభ్ (బెంగుళూరు) తెలిపారు. రేడియో మెట్రిక్ పద్ధతులను ఉపయోగించి వీటి ఖచ్చితమైన వయసును తెలుసుకోవచ్చని చెప్పారు.
కెనడాలో అతిపెద్ద డైక్లు
కెనడా వాయవ్య ప్రాంతంలోని మెకంజీ డైక్ల సమూహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద డైక్లుగా పరిగణిస్తున్నారు. మూడు డజన్లకుపైగా ఉన్న ఈ చారలు దాదాపు 500 కి.మీ. వెడల్పు, 3,000 కి.మీ. పొడవుతో వ్యాపించి ఉంటాయి. ఇవి సుమారు 1,268 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని పరిశోధకుల అంచనా. అలాగే జింబాబ్వేలో కూడా దాదాపు 550 కి.మీ. వెడల్పుతో విస్తరించిన డైక్లు ఉన్నాయి.