సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలువలేకపోయిన టీమ్ఇండియా.. అందని ద్రాక్షను ఒడిసిపట్టేందుకే వచ్చామని తొలి రోజే ప్రత్యర్థికి హెచ్చరికలు పంపింది. ఆడుతున్నది సెంచూరియన్లోనైనా.. పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తున్నా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన కోహ్లీసేన భారీ స్కోరుకు బాటలు వేసింది. పచ్చిక పిచ్పై సఫారీ బౌలర్లు స్వింగ్తో ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం అదరక బెదరక ఎదురుదాడికి దిగి బాక్సింగ్ డే టెస్టులో శుభారంభం చేసింది!
ఇటీవలి కాలంలో ఫార్మాట్తో సంబంధం లేకుండా.. పరుగుల వరద పారిస్తున్న కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగితే.. సహచర కన్నడిగుడు మయాంక్ అగర్వాల్ హాఫ్సెంచరీతో అదరగొట్టాడు. ఫామ్లేమితో తంటాలు పడుతున్న అజింక్యా రహానే తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడితే.. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు మంచి టచ్లో కనిపించాడు. ప్రొటీస్ పేసర్లను ఎదుర్కొంటూ తొలి రోజు మంచి స్కోరు సాధించిన టీమ్ఇండియా.. ఇక రెండో రోజు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంటే.. ఎంగ్డీని ఆదర్శంగా తీసుకొని సమిష్టిగా సత్తాచాటాలని ఎల్గర్ సేన తహతహలాడుతున్నది!
సెంచూరియన్: సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ చేజిక్కించుకోలేకపోయిన భారత జట్టు.. ఈసారి చరిత్ర తిరుగరాయాలని కంకణం కట్టుకున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీ బాదితే.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60; 9 ఫోర్లు) అర్ధశతకం నమోదు చేశాడు. వీరిద్దరు తొలి వికెట్కు 117 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. అజింక్యా రహానే (40 బ్యాటింగ్; 8 ఫోర్లు), విరాట్ కోహ్లీ (35) ఫర్వాలేదనిపించగా.. చతేశ్వర్ పుజారా (0) గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఐదుగురు బౌలర్ల ఫార్ములాకే కట్టుబడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్పై సెంచరీ చేసిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కాదని మరోసారి రహానేపై నమ్మకముంచాడు.
అదిరే ఆరంభం..
పేస్ పిచ్పై తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా.. తొలి సెషన్లో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. బంతి అనూహ్యంగా దూసుకొస్తుండటంతో పాటు.. బౌన్స్ అవుతుండటంతో ఓపెనర్లు రాహుల్, మయాంక్ ఆరంభంలో కాస్త తడబడ్డారు. కుదురుకున్నాక మయాంక్ బ్యాట్కు పనిచెప్పాడు. బౌలర్తో సంబంధం లేకుండా ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. దీంతో తొలి సెషన్ పూర్తయ్యేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. లంచ్ తర్వాత మయాంక్ ఔట్ కాగా.. మరుసటి బంతికే పుజారా కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో రాహుల్కు కోహ్లీ జత కలిశాడు. ఈ జోడీ ఆచితూచి ఆడటంతో పరుగుల రాక మందగించినా.. క్రీజులో నిలదొక్కుకున్నాక విరాట్ చక్కటి స్ట్రోక్ ప్లేతో అలరిస్తే.. రాహుల్ మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. ఫలితంగా టీమ్ఇండియా 157/2తో రెండో సెషన్ను ముగించింది. ఈ క్రమంలో ఆఫ్స్టంప్కు దూరంగా ఎంగ్డీ వేసిన బంతిని వెంటాడిన విరాట్.. స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన రహానే వచ్చీరావడంతోనే సఫారీ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. ఎదుర్కొన్న రెండో బంతికి బౌండ్రీ బాదిన జింక్స్.. ఆట ముగిసేంత వరకు అదే దూకుడు కనబర్చాడు.
2010 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాల్గా సఫారీ గడ్డపై తొలి వికెట్కు భారత్ తరఫున ఇది మూడో శతక భాగస్వామ్యం
నల్లరిబ్బన్లతో..
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత డెస్మాండ్ టుటు మృతికి సంతాపంగా ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు మౌనం పాటించాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో మైదానంలో అడుగుపెట్టారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సర్వమానవ సౌభ్రాతత్వం కోసం పరితపించిన డెస్మాండ్ (90) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ 122 బ్యాటింగ్, మయాంక్ (ఎల్బీ) ఎంగ్డీ 60, పుజారా (సి) పీటర్సన్ (బి) ఎంగ్డీ 0, కోహ్లీ (సి) ముల్డర్ (బి) ఎంగ్డీ 35, రహానే 40 బ్యాటింగ్, ఎక్స్ట్రాలు: 15, మొత్తం: 90 ఓవర్లలో 272/3. వికెట్ల పతనం: 1-117, 2-117, 3-199, బౌలింగ్: రబడ 20-5-51-0, ఎంగ్డీ 17-4-45-3,జాన్సెన్ 17-4-61-0, ముల్డర్ 18-3-49-0, కేశవ్ 18-2-58-0.