భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ చాలా గొప్ప నాయకుడని, అందరిలోనూ స్ఫూర్తి నింపేవాడని జట్టు తాత్కాలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. బుధవారం నుంచి సఫారీలతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాజీ సారధి కోహ్లీ గురించి మాట్లాడాడు.
‘‘విరాట్ సారధ్యంలో భారత జట్టు అంతకు ముందు సాధించలేని ఎన్నో అద్భుతాలు చేసింది. ఎన్నో గొప్ప పనులు చేసిన కోహ్లీ జట్టుకు కొన్ని స్టాండర్డ్స్ ఏర్పాటు చేశాడు. వాటిపై ఒక జట్టుగా అభివృద్ది చెందడం చాలా ముఖ్యం. ప్రతి సిరీస్ కూడా భిన్నమైనదే. అందరూ సౌతాఫ్రికాలో ఆడేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు’’ అని రాహుల్ చెప్పాడు.
కెప్టెన్సీ విషయంలో విరాట్.. అందరిలోనూ అత్యుత్తమ సత్తాని బయటకు తీసుకురాగలడని కితాబిచ్చాడు. అందరినీ ముందుకు తీసుకెళ్తూ, తామంతా అద్భుతాలు సృష్టించగలమనే నమ్మకాన్ని అందించాడని వెల్లడించాడు. కోహ్లీ నుంచి తాను నేర్చుకున్నది అదేనని, జట్టులో తాను కూడా అలా చేయగలనని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. బుధవారం నాడు సౌతాఫ్రికాలోని పార్ల్ వేదికగా మూడు వన్డేల సిరీస్లో తొలి వన్డే జరగనుంది.