చెన్నై: చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ను తమ పదునైన బంతులతో వణికించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(40: 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్ శర్మ(32: 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్హిట్టర్ కీరన్ పొలార్డ్(35 నాటౌట్: 22బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) చెలరేగడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ రెహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ముంబైకి అదిరే ఆరంభం లభించింది. డికాక్, రోహిత్ ధాటిగా ఆడటంతో పవర్ప్లే ఆఖరికి 53/0తో మంచిస్థితిలో నిలిచింది. ఓపెనర్లు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఓమాదిరి స్కోరుకే పరిమితమైంది. పవర్ప్లేలో దంచికొట్టిన ముంబై కెప్టెన్ రోహిత్ ఔటైన తర్వాత స్కోరు వేగం దారుణంగా పడిపోయింది. ఆరంభంలో ముంబై జోరు చూస్తే కనీసం 180 స్కోరు చేస్తుందేమో అనిపించింది. అనూహ్యంగా విజయ్ శంకర్ బౌలింగ్లో రోహిత్ పెవిలియన్ చేరడంతో సీన్ రివర్స్ అయింది.
తన తర్వాతి ఓవర్లో ఫామ్లో ఉన్న సూర్య కుమార్ యాదవ్(10)ను ఔట్ చేసి ముంబైని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్ బ్యాట్స్మెన్ను వణికించారు. బౌలర్ల ధాటికి ఇషాన్ కిషన్(12: 21 బంతుల్లో) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఆఖర్లో పొలార్డ్ విజృంభించడంతో ముంబై 150 పరుగుల మార్క్ దాటింది.