Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిటేషన్లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు. ఈ మేరకు ఎన్సీఏలో పంత్ జిమ్లో చెమటోడ్చుతున్నాడు. తాజాగా అతడు ఇన్స్టా స్టోరీస్ వేదికగా జిమ్లో భారీ బరువులను ముందుకు నెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘కీప్ పుషింగ్ ఇన్ లైఫ్’ అని స్టేటస్ పెట్టాడు. 2022 డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తూ పంత్ కారు డివైడర్కు ఢీకొనడంతో అతడు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.
ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యాక కొద్దిరోజులకు ఎన్సీఏలో చేరిన పంత్.. అక్కడే వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున హాజరైన పంత్.. మార్చి మాసాంతంలో మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్ కోసం జిమ్లో చెమటోడుస్తున్నాడు.
Rishabh Pant working hard to make a strong comeback. pic.twitter.com/OvwCjRm38T
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024
రెండ్రోజుల క్రితం స్టార్ స్పోర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ తన రోడ్డు ప్రమాదం గురించి స్పందిస్తూ… ‘ఆ సమయంలో నాకు ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోయిందని నా జీవితంలో తొలిసారి అనిపించింది. గాయాల తీవ్రత నాకు తెలుస్తోంది. ఎవరో నన్ను రక్షించారని నేను అనుకున్నా. అంత తీవ్రంగా గాయపడ్డా నేను బతికి బట్టకట్టానంటే అది అదృష్టమే అని చెప్పాలి. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిసారి డాక్టర్తో నేను ఎప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుంటాను..? అని అడిగేవాడిని. అప్పుడు డాక్టర్ కనీసం 16-18 నెలల టైమ్ పడుతుందని చెప్పేవాడు. త్వరగా రికవరీ అవడానికి కష్టపడ్డా..’ అని చెప్పాడు.
Can’t wait to see you on field, #RP17 💙🧤#RishabhPant | @RishabhPant17 pic.twitter.com/JpxW4bPnfR
— Delhi Capitals (@DelhiCapitals) January 30, 2024