ముంబై: బౌలింగ్కు సహకరిస్తున్న స్లో పిచ్పై ఆఖర్లో ధాటిగా ఆడిన బెంగళూరు ఐపీఎల్ 15వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. మొదట రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్; 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. హెట్మైర్ (42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడిన రాయల్స్ ఆటగాళ్లు చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు రాబట్టుకోవడంతో రాజస్థాన్ మంచి స్కోరు చేయగలిగింది.
అనంతరం ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్ (29), అనూజ్ (26) ఫర్వాలేదనిపించగా.. కోహ్లీ (5), విల్లే (0), రూథర్ఫార్డ్ (5) విఫలమయ్యారు. దీంతో బెంగళూరు గెలుపు కష్టమే అనిపించినా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), షాబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచి కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 33 బంతుల్లో 67 పరుగులు జతచేశారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కార్తీక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం కోల్కతాతో ముంబై తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 169/3 (బట్లర్ 70 నాటౌట్, హెట్మైర్ 42 నాటౌట్; హర్షల్ 1/18), బెంగళూరు: 19.1 ఓవర్లలో 173/6 (షాబాజ్ 45, కార్తీక్ 44* ; చాహల్ 2/00).