Kapil Dev Vs Jadeja | భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు అహంతో ఉన్నారని, తమకే అన్నీ తెలుసుననే భావనలో ఉంటారంటూ విమర్శించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. వెస్టిండీస్తో జరిగే మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడారు. మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించాలని, అయితే కపిల్ దేవ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పాడు. ఆటగాళ్లు కేవలం భారత జట్టును గెలిపించడంపైనే దృష్టి పెడుతారని, వారికి వ్యక్తిగత ఎజెండా లేదని జడేజా తెలిపాడు.
ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయం ఉంటుందని, మాజీ ఆటగాళ్లకు అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందన్న జడేజా.. ఆటగాళ్లలో అహం ఉందని తాను అనుకోవడం లేదన్నాడు. ప్రతి ఒక్కరూ క్రికెట్ను ఆస్వాదిస్తున్నారని, ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని, ఎవరూ ఏమీ తేలిగ్గా తీసుకోవడం లేదన్నాడు. వందశాతం ప్రదర్శన చేస్తున్నారన్నాని చెప్పాడు. సాధారణంగా భారత జట్టు ఓటమి పాలైన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని జడేజా.. జట్టుగా రాణించడమే తమ లక్ష్యమని, యువకులు, సీనియర్స్తో జట్టులో మంచి కూర్పు ఉందని పేర్కొన్నారు.
భారత జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లపై ఇటీవల మాజీలు విమర్శలు గుప్పించారు. ఆటగాళ్లు ఈగోకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు క్లిష్ట సమయాల్లో సలహాల కోసం తనను సంప్రదించే వారని.. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ప్రస్తుత ఆటగాళ్లను మాజీలను సంప్రదించడం లేదని, వారికి అహం ఉన్నట్టుగా ఉంది సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ కపిల్ దేవ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఆటగాళ్లు అన్నీ తమకే తెలుసుననే భావనలో ఉన్నారని, ఐపీఎల్తో కెరీర్ ప్రారంభంలోనే ఎక్కువ డబ్బు వస్తుండడంతో కొందరి అహం వస్తోందని విమర్శించారు. చాలా మంది క్రికెటర్లకు ప్రస్తుతం సాయం అవసరమని తాను అనుకుంటున్నానని, సునీల్ గవాస్కర్ అక్కడ ఉన్నా.. అతడితో ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ఇందులో ఎలాంటి అహం ఉండదని, కానీ మేం అంతా బాగానే ఉన్నామని ఆటగాళ్లు అనుకుంటున్నారన్నారు. 50 సీజన్ల క్రికెట్ చూసిన వారి నుంచి అదనపు సాయం తీసుకోవాలని, కొన్నిసార్లు వినడం కూడా ఆలోచనలను మార్చగలదని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.