Kapil Dev | టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గత శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీలోని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన కొందరు స్థానికులు, హర్యానా బస్ డ్రైవర్, కండక్టర్ రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిద్రరావడం, అదే సమయంలో గుంతను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఆసుప్రతిలో కొలుకుంటుండగా.. అభిమానులు పంత్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భారత దిగ్గజ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రమాదంపై స్పందించారు. ఈ క్రమంలో ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. ‘ఇదొక పాఠం. నేను కూడా కెరీర్ మొదట్లో మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను మోటారు బైక్ను ముట్టనివ్వలేదు. రిషబ్ పంత్ క్షేమంగా బయటపడినందుకు దేవుడికి ధన్యవాదాలు.
నీకు మంచి కారు ఉంది. దానిపై వేగంగా దూసుకుపోవచ్చు. కానీ, జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్ ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. ఆ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు తీసుకోగలవు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవాలి’ అంటూ కపిల్ దేవ్ సూచించారు.