Imran Khan | మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు వెటరన్ క్రికెటర్లు స్పందించారు. జైలులో అనారోగ్యంతో ఉన్న ఇమ్రాన్కు మానవతా దృక్పథంతో తగిన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇండియా నుంచి లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఒక ప్రకటన చేశారు. ఇమ్రాన్ ఖాన్ మూడేళ్లుగా పాక్లోని జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఆయనకు పాక్ ప్రభుత్వం సరైన వైద్యం అందించడం లేదని ఇమ్రాన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్కు మానవతా కోణంలో సరైన వైద్యం అందించాలని 14 మందితో కూడిన క్రికెట్ మాజీ కెప్టెన్ల బృందం కోరింది. దీనిపై పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందులో ఇండియా నుంచి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్తోపాటు ఆస్ట్రేలియన్ గ్రేట్ గ్రెగ్ చాపెల్, మైఖేల్ అథర్టన్, స్టీఫెన్ వా, జాన్ రైట్, అలన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్, మైఖేల్ బ్రేర్లీ, నాజిర్ హుస్సేన్, ఇయాన్ చాపెల్, కిమ్ హ్యూస్, డేవిడ్ గ్రోవర్, బెలిందా క్లాక్ సంతకాలు చేసిన ఒక ప్రకటన తాజాగా మీడియాకు విడుదల చేశారు. క్రీడాస్ఫూర్తితోనే క్రికెటర్గా ఇమ్రాన్కు మద్దతు తెలుపుతున్నట్లు వారు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇమ్రాన్కు సంబంధించి ఎలాంటి చట్టపరమైన అంశాలకు భంగం కలగకుండా చికిత్స అందించాలని కోరారు. అతడికి పూర్తి భద్రత కల్పించాలని, న్యాయ సహాయం అందించాలని, కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతించాలని కూడా లేఖలో డిమాండ్ చేశారు. తక్షణమే వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ క్రికెట్కు విశేష సేవలందించారు. పాక్ గెలిచిన ఏకైక వరల్డ్ కప్ (1992) ఆయన కెప్టెన్సీలోనే. అందుకే క్రికెట్ వరల్డ్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా ప్రకటన విడుదల చేశారు.