Kambala : కర్నాటక సాంప్రదాయ కంబల(Kambala) పరుగు పందెం పోటీలు ప్రారంభమయ్యాయి. కర్నాటక రాష్ట్రం లోని తీర ప్రాంతాలకు చెందిన పురాతనమైన ఈ ఆట ఇప్పుడు బెంగళూరులోని ప్రజలకు వినోదం పంచనుంది. నవంబర్ 25 రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కంబల పోటీలు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన వాళ్లు తమ దున్నలు అందంగా అలంకరించి తీసుకొచ్చారు.
ఈ పోటీల్లో 180కి పైగా జతల దున్నలు, వాటి యజమానులు, జాకీలు, కేర్ టేకర్స్ పాల్గొననున్నారు. దున్నలు పరుగుతీయడం కోసం నిర్వాహకులు 135 మీటర్ల పొడవుతో రెండు బురద గుంటలను ఏర్పాటు చేశారు. ఇక పోటీ మొదలవ్వగానే యువకులు వాటిని బురదనీళ్లలో పరుగుతీయిస్తారు. ఎవరి దున్నలు వేగంగా పరిగెత్తితే వాళ్లు గెలిచినట్టు. బురద చిమ్ముకుంటూ దున్నలు దౌడు తీస్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ మస్త్ ఎంజాయ్ చేస్తారు.
కంబల అనేది 400 ఏండ్ల క్రితం నాటి ఆట. ముఖ్యంగా కర్నాటకలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ వేడుకను నిర్వహించేవి. ఏండ్లుగా మారుమూల ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆటను కొందరు నగర ప్రజలకు పరిచయం చేయాలనుకున్నారు. బెంగళూరులోని మూడబిద్రి, పుత్తూర్, బెల్తంగడి, కర్కాల, దక్షిణ కన్నడ, ఉడిపి, మంగళూరు జిల్లాలకు చెందిన 70కి పైగా సంస్థలు కంబల పోటీల నిర్వహణకు ముందుకొచ్చాయి.