దుబాయ్: టీ20 వరల్డ్కప్ తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ అనూహ్య రీతిలో ఓటమి చవిచూసింది. దాదాపు విజయం ఖాయం అనుకున్న సమయంలో.. న్యూజిలాండ్ హిట్టర్ జిమ్మీ నీషమ్ భారీ షాట్లతో అలరించాడు. కీలకమైన దశలో మూడు సిక్సర్లు కొట్టి ఇంగ్లండ్ ఆశలుపై నీళ్లు చల్లాడు. రవత్తరంగా సాగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే 17వ ఓవర్లో ఇంగ్లండ్ ఫీల్డర్ జానీ బెయిర్స్స్టో అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. నీషమ్ కొట్టిన భారీ షాట్ను అతను లాంగ్ ఆన్ బౌండరీ లైన్ వద్ద డ్రైవ్ చేసి క్యాచ్ పట్టాడు. క్యాచ్ అందుకుని బౌండరీ రోప్ తాకుతున్న సమయంలో తన చేతుల్లోని బంతిని మరో ఫీల్డర్ లివింగ్స్టోన్కు అందించాడు. అయితే క్యాచ్ పట్టుకుంటున్న సమయంలో బెయిర్స్స్టో మోకాలు బౌండరీ రోప్ను టచ్ చేసింది. దీంతో నీషమ్కు సిక్సర్ ఇచ్చేశారు. కేవలం 11 బంతుల్లో 27 రన్స్ చేసిన నీషమ్ ఇంగ్లండ్ ఆశల్ని ఆవిరిచేసేశాడు. ఆ తర్వాత కివీస్ ఓపెనర్ మిచెల్ 19వ ఓవర్లో మ్యాచ్ను మూడు బౌండరీలతో ముగించాడు. అతను 47 బంతుల్లో 72 రన్స్ చేశాడు.