Jay Shah: దేశ ప్రజలు ‘సెవెన్ సిస్టర్స్’గా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకనుంచి క్రికెట్ కూడా భాగం కానుంది. దేశంలోని మిగతా ప్రాంతాల వలే అక్కడ కూడా క్రికెట్ అభివృద్ధికి పాటుపడేందుకు బీసీసీఐ కృషి చేస్తున్నదని, త్వరలోనే అక్కడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. ముంబైలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో పాల్గొనడానికి విచ్చేసిన జై షా విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జై షా మాట్లాడుతూ.. ‘ఈశాన్య రాష్ట్రాలలో క్రికెట్ అకాడమీలను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా వాటిని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నాం..’ అని చెప్పాడు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ప్రదేశ్ రాజధానులలో క్రికెట్ అకాడమీలు తుదిదశలో ఉన్నాయి. మణిపూర్లో గతకొంతకాలంగా స్థానికంగా చెలరేగుతున్న ఆందోళనల కారణంగా ఇక్కడ క్రికెట్ అకాడమీ ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశముంది. కానీ మేఘాలయా, త్రిపురలలో కూడా అకాడమీలు ఏర్పాటుకు సిద్దమైనట్టు సమాచారం. వీటితో పాటు జమ్మూ, కాశ్మీర్ లో కూడా అకాడమీ ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ఎన్సీఏకు ఎక్స్టెన్షన్..
భారత క్రికెట్కు ఆయువు పట్టుగా ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో మరిన్ని హంగులు సంతరించుకోనున్నాయి. ఎన్సీఏలో హై క్వాలిటీ సెంటర్ను ఏర్పాటుచేస్తున్నామని, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ఉన్న హై పర్ఫార్మెన్స్ సెంటర్ మాదిరిగా దీనిని నిర్మించనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. జై షా కూడా దీనిని ఖరారు చేశాడు. 2024 ఆగస్టు నాటికి ఇది సిద్ధమవుతుందని జై షా తెలిపాడు.