న్యూఢిల్లీ: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్నకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మెగాటోర్నీ వరకు కోలుకొని తిరిగి వస్తాడని అభిమానులు ఆశించినా.. అతడి గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పట్లో అది సాధ్యపడదని జై షా తెలిపాడు. ‘బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు అతడిని టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించాం’ అని జై షా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. అతడి స్థానంలో ప్రస్తుతానికి ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. స్టాండ్బై ఆటగాడిగా ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్లో ఒకరికి చాన్స్ దక్కనుండగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్లో ఒకరు స్టాండ్బైగా ఎంపికయ్యే అవకాశముంది.