భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ ఐదో బంతి వేసిన తర్వాత ఫాలోత్రూ సమయంలో బుమ్రా పాదం మెలికపడింది. దీంతో అతను కుప్పకూలాడు.
పరిస్థితిని గమనించిన టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ హుటాహుటిన మైదానంలోకి వచ్చాడు. బుమ్రా పాదాన్ని పరిశీలించాడు. మళ్లీ వెంటనే బౌలింగ్ చేయడం వల్ల కాకపోవడంతో బుమ్రా.. ఫిజియో వెంట మైదానాన్ని వీడాడు. దీంతో ఆ ఓవర్ను మహమ్మద్ సిరాజ్ పూర్తిచేశాడు.
ఈ ఘటనను చూసిన అభిమానులు బుమ్రాకు తగిలిన గాయం మరీ పెద్దదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయం మరీ పెద్దదై అతను కనుక మిగతా టెస్టులకు దూరమైతే భారత జట్టుకు అది పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని క్రికెట్ పండితులు కూడా అంటున్నారు.