టోక్యో : గొప్ప ఆవిష్కరణలు, అంకితభావానికి ప్రసిద్ది అని జపాన్ మరోసారి రుజువు చేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి అద్భుతమైన ఒలింపిక్స్ పతకాలను సిద్ధం చేసి ప్రపంచానికి పర్యావరణ సమస్యలను గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా చెడిపోయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి అందమైన ఒలింపిక్ పతకాలుగా మలిచి ఔరా! అనేలా చేసింది. దేశ ప్రజలను భాగస్వాములుగా చేసి ఒలింపిక్స్ కోసం 5,000 బంగారు, వెండి, కాంస్య పతకాల తయారీకి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ వేస్టేజ్ను సేకరించింది. రెండేండ్ల క్రితం నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టి మెడల్స్ తయారయ్యేలా చేయడంలో జపాన్ ప్రభుత్వం విజయం సాధించింది.
దేశవ్యాప్తంగా పనికిరాని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించే పనిని జపాన్ ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం 90 శాతం నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి మొత్తం 80 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేసింది. వీటి నుంచి 32 కిలోల బంగారం, 23,492 గ్రాముల వెండి, దాదాపు 2,200 కిలోల కాంస్యాన్ని సేకరించింది. రియో ఒలింపిక్స్ సమయంలో బంగారు, వెండి పతకాల్లో 30 శాతం కారు విడి భాగాలు, అద్దాల ఉపరితలాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేశారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా, జపాన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, దేశవ్యాప్తంగా మునిసిపల్ కౌన్సిల్స్, పాఠశాలలు, స్థానిక కమ్యూనిటీ సెంటర్ల సహాయంతో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించింది. ప్రజలు తమ తమ ఇండ్లలో పడివున్న చెడిపోయిన మొబైల్స్, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దానం చేయాలని కోరారు. దాంతో చాలా మంది ప్రజలు ముందుకొచ్చి తమ వద్ద ఉన్న పనికిరాని ఎలక్ట్రానిక్స్ వస్తువులను ప్రభుత్వానికి దానం చేశారు.
దాదాపు ఎనిమిది టన్నుల వ్యర్థాలు పోగవగా.. వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా 5,000 ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ పతకాలను తయారుచేయడానికి వినియోగించి సుస్థిర భవిష్యత్ అనే ఇతివృత్తాన్ని అమలుచేసినట్లు టోక్యో 2020 స్పోర్ట్స్ డైరెక్టర్ కోజి మురోఫుషి ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని చిన్నారులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములుగా మారారని, తాము ఇచ్చిన వ్యర్థాలతో పతకాలు సృష్టించిన విషయం పిల్లలకు చాలా పెద్ద జ్ఞాపకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..