ఫిఫా ప్రపంచకప్లో ఆసియా కింగ్ జపాన్ ప్రస్థానం ముగిసింది. పోరాటమే పరమావధిగా పోటీకి దిగిన జపాన్..క్రొయేషియా చేతిలో ఓటమితో నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో జరిగిన షూటౌట్లో జపాన్పై క్రొయేషియా పైచేయి సాధించింది. సెనెగల్పై భారీ విజయంతో ఇంగ్లండ్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
అల్ ఖోర్(ఖతార్): ఫిఫా ప్రపంచకప్లో రసవత్తర మ్యాచ్ల పరంపర కొనసాగుతున్నది. టైటిల్ దక్కించుకోవడమే లక్ష్యంగా జట్లు దూసుకెళుతున్నాయి. సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ప్రిక్వార్టర్స్ పోరులో క్రొయేషియా 4-2 తేడాతో జపాన్(పెనాల్టీ షూటౌట్)పై విజయం సాధించింది. అల్ జనాబ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. మెగాటోర్నీలో అనూహ్య విజయాలతో ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించిన జపాన్..నిరుటి(2018)రన్నరప్ క్రొయేషియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఆది నుంచే తమదైన దూకుడు కొనసాగించిన జపాన్..క్రొయేషియా దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.
మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. జపాన్ తరఫున డైజన్ మైడ(43ని), ఇవాన్ పెర్సిచ్(55ని) క్రొయేషియాకు ఏకైక గోల్ అందించాడు. రెండుసార్లు పొడిగించిన మ్యాచ్ అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్ చేయకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. నాలుగు ప్రయత్నాల్లో జపాన్ ఒకసారి సఫలం కాగా, క్రొయేషియా మూడు సార్లు విజయవంతమైంది. మరోవైపు ప్రిక్వార్టర్స్లో ఇంగ్లండ్ 3-0తో సెనెగల్పై భారీ విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున హెండర్సన్(38ని), హ్యారీ కేన్(45+ని), బుకాయో సాకా(57ని) గోల్స్ చేశారు.