ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్, పుణెరీ పల్టాన్ జట్లు టైటిల్ పోరుకు దూసుకెళ్లాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్ 49-29 స్కోరుతో బెంగళూరు బుల్స్ను ఓడించగా, రెండో సెమీఫైనల్లో పుణె 39-37తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో జైపూర్కు చెందిన అజిత్, సాహుల్కుమార్ సూపర్ టెన్స్ సాధించగా, రెజా, అంకుష్ చెరి 5, అర్జున్ 4 పాయింట్లు సాధించాడు. బెంగళూరు జట్టులో భరత్ అత్యధికంగా 7, వికాస్ కండోలా 5, నీరజ్, సౌరభ్, అమన్ తలా 4 పాయింట్లు సాధించారు.
పోటాపోటీగా సాగిన రెండో సెమీస్లో తొలుత తలైవాస్ విరామానికి 21-15తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో పుణె పుంజుకుని ఆట ముగిసేసరికి రెండు పాయింట్లు తేడాతో తలైవాస్ను మట్టికరిపించింది. పుణె జట్టులో పంకజ్ మోహిత్ 16 పాయింట్లతో అదరగొట్టాడు. తతిమా వారిలో నబిభక్ష్ 6, గౌరవ్, ఆకాష్ చెరి 4 పాయింట్లు సాధించారు. తలైవాస్ జట్టులో నరేందర్(12) సూపర్ టెన్ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. తతిమా వారిలో అజింక్య 7, సాహిల్ 3 పాయింట్లు సాధించారు. ఫైనల్ శనివారం జరుగుతుంది.