హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై నోరు పారేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఆత్మగౌరవం ఉంటే.. పేదల ఆస్తులను అక్రమంగా ఆక్రమించేవారు కాదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కేసీఆర్ నాయకులుగా తయారు చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఎంతో మంది టీఆర్ఎస్ లో చేరారు.. వెళ్లిపోయారు. బయటకు వెళ్తూ కేసీఆర్పై విమర్శలు చేశారు. ఈటల కూడా అదే చేశారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారు.
అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం అని తెలిపారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు.. బయటకు వెళ్లి నియంత, దెయ్యం అంటున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే. ఈటల వెనుక ఉన్నది కొంత మంది అసంతృప్తులు మాత్రమే అని తెలిపారు. హుజురాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం మీద ఈటల వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. ఈటలను టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవించింది అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ప్రగతి భవన్లోకి రానివ్వలేదని చెబుతున్నారు. ప్రగతి భవన్లోకి రానివ్వకుంటే అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే వారి భూములు ఎందుకు ఆక్రమించారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగారు.