Jai Shah : వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థులు భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ తేదీ మారనుందనే వార్తలు రెండు రోజులుగా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అదే జరిగితే పెద్ద మొత్తంలో నష్టపోతామంటూ చాలామంది ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు నిజమేనని భారత క్రికెట్ బోర్డు(BCCI) సెక్రటరీ జై షా(Jai Shah) అన్నాడు. షెడ్యూల్ మార్చాలంటూ రెండు, మూడు బోర్డుల నుంచి అభ్యర్థనలు వచ్చాయని, త్వరలోనే తేదీల మార్పు గురించి వెల్లడిస్తామని అతను తెలిపాడు.
అయితే.. భారత్, పాకిస్థాన్, మ్యాచ్ గురించి మాత్రం జై షా ప్రస్తావించకపోవడం గమనార్హం. ‘మ్యాచ్ తేదీలు మార్చాలంటూ మాకు రెండు, మూడు బోర్డుల నుంచి వినతులు వచ్చాయి. అయితే.. అవి భారత్, పాకిస్థాన్ మ్యాచ్కి సంబంధించినవి కావు’ అని జై షా స్పష్టం చేశాడు. దాంతో, దాయాదుల పోరు గురించి చెప్తారని ఎంతో ఆశించిన అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే ఈ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ఈ ఏడాది వరల్డ్ కప్ టీమిండియా, పాక్ హై ఓల్టేజీ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్(Ahmedabad)లో అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే.. అదే రోజు దేవీ నవరాత్రులు(Navaratri) మొదలవ్వనున్నాయి. దాంతో, వేలాది మంది అభిమానులు తరలి వచ్చే ఈ మ్యాచ్కు భద్రత కల్పించడం కష్టమవుతుందని.. అందుకని మ్యాచ్ను ముందు తేదీకి అంటే అక్టోబర్ 14న నిర్వహించాలని అహ్మదాబాద్ పోలీసులు బీసీసీఐని కోరారు. అయితే.. బీసీసీఐ మాత్రం తేదీని మారుస్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ నిర్వహిస్తారా? లేదా ముందు రోజు ఆడిస్తారా? అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
వరల్డ్ కప్లో భారత్కు పాక్పై తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇరుజట్లు ఏడుసార్లు తలపడగా ఏడుసార్లు మనజట్టే గెలుపొందింది. చివరిసారిగా భారత్, పాక్ 2019 వరల్డ్ కప్లో ఢీ కొన్నాయి. అప్పుడు కూడా టీమిండియా దాయాదిని చిత్తుగా ఓడించింది.
ఈసారి సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగనుంది. అందుకని ఇరుజట్ల పోరు కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్తో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.