హైదరాబాద్ : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పిలుపు మేరకు గచ్చిబౌలి స్టేడియంలో ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ను శాట్స్ ఏర్పాటు చేసింది. దీనిని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్రావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్ల వెంట 120 కోట్ల మంది భారతీయులు అండగా ఉన్నామనే భరోసా, వాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖలు చీర్ ఒలింపిక్స్ క్యాంపైన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు క్రీడాకారులు సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్తో పాటు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భజ్రంగ్ పూనియా, అతూన్ దాస్, దీపికా కుమారి, మనుభాకర్, నీరజ్ చోప్రా, ద్యూతీ చంద్, మీరాభాయ్ చాను అంచనాలు అందుకుని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టోక్యో వెళ్లే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, సాయ్, భారత ఒలింపిక్ సంఘం అన్ని చర్యలు తీసుకుంటుందని జగన్ మోహన్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్స్ కోచ్లు నంద గోకుల్ యాదవ్, సుధాకర్, చారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.