Sunil Gavaskar : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భార్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా దారుణ ఓటమికి కారణాలు ఏంటి? అని అన్వేషిస్తున్నారంతా. ఈ టెస్టులో భారత జట్టు ఓటమికి మొదటి ఇన్నింగ్స్లో జడేజా నో బాల్ వేయడమే కారణం అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ నో బాల్తో భారీ మూల్యం చెల్లించుకుందని అతను అన్నాడు. ‘మార్నస్ లబుషేన్ సున్నాకే ఔటయ్యేవాడు.
కానీ, జడ్డూ నో బాల్ వేయడంతో అతను బతికి పోయాడు. అతను రెండో వికెట్కు ఉస్మాన్ ఖావాజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ 109కే ఆలౌట్ అయిన చోట లబుషేన్ (31), ఖవాజా (60) భారత స్పిన్నర్లను పరీక్షిస్తూ 96 రన్స్ జోడించారు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ మ్యాచ్ను మలుపు తిప్పింది’ అని గవాస్కర్ వెల్లడించాడు.
కీలకమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అశ్విన్ తొలి ఓవర్లోనే ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. కానీ.. లబుషేన్ (28), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.