అహ్మదాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు చేజిక్కించుకుంది. టోర్నీ ఆసాంతం నిలకడ కనబర్చిన సౌరాష్ట్ర టీమ్ శుక్రవారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తుచేసి రెండోసారి కప్పు కైవసం చేసుకుంది. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) భీకర ఫామ్ కొనసాగిస్తూ.. ‘హ్యాట్రిక్’ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అనంతరం సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 249 రన్స్ చేసింది. షెల్డన్ జాక్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. జాక్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. రుతురాజ్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైదేవ్ ఉనాద్కట్ (1/25) బంతితో నిప్పులు చెరిగాడు. తొలి స్పెల్లో అతడు 6 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇవ్వగా.. 49వ ఓవర్లో చిరాగ్ జానీ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు.