హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. మంగళవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు హుస్సేన్సాగర్ వేదికగా 37వ ఎడిషన్కు తెరలేవనుంది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగే పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 100 మందికి పైగా సెయిలర్లు పోటీ పడే అవకాశముంది. జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నీకి సంబంధించిన వివరాలను సోమవారం మీడియా సమావేశంలో మేజర్ జనరల్, డిప్యూటీ కమాండెంట్ అజయ్శర్మ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్ కోసం గత పదిహేను రోజులు నుంచి చాలా కష్టపడుతున్నాం. ఇందులో భాగంగా సెయిలర్లకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతానికి ఈవెంట్ కోసం 80 మంది సెయిలర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మంగళవారం ప్రాక్టీస్ రేసు జరుగనుండగా, బుధవారం నుంచి ప్రధాన పోటీలు జరుగుతాయి. జూలై-ఆగస్టు నెలల్లో హైదరాబాద్లో వాతావరణం సెయిలింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. హుసేన్సాగర్ మీదుగా వీచే గాలులు సెయిలర్ల ప్రతిభకు పరీక్ష పెడుతుంది.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యుహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. పర్యావరణహితమైన సెయిలింగ్ పట్ల నానాటికీ ఆదరణ పెరుగుతున్నది. రానున్న రోజుల్లో మరింత మంది సెయిలర్లు వెలుగులోకి రానున్నారు. సెయిలింగ్ను కెరీర్గా ఎన్నుకుంటూ యువతీయువకులు ముందుకు సాగుతున్నారు’ అని అన్నారు. ఓవైపు హైదరాబాద్ సెయిలింగ్ వీక్తో పాటు జాతీయస్థాయి సెయిలింగ్ కోచింగ్ క్యాంప్, జాతీయ జడ్జీలకు సెమీనార్లు నిర్వహిస్తున్నామని అజయ్శర్మ పేర్కొన్నారు.