షుల్(జర్మనీ): ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో రాష్ట్ర యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ పతక జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుశ్ పసిడి పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో ధనుశ్ 249.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కలిన్ పొంటోస్ (248.1, స్విట్జర్లాండ్), రోమైన్ (227.1, ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 628.4 పాయింట్లతో ఆరో స్థానంతో ధనుశ్ ఫైనల్స్కు అర్హత సాధించాడు.
ధనుశ్తో పాటు ప్రాతమ్ బందన (628.7), అభినవ్ షా (626.7) ఫైనల్లో నిలిచారు. అయితే ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ తెలంగాణ యువ షూటర్ ఎక్కడా వెనుదిరిగి చూడకుండా చెక్కుచెదరని గురితో రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ షూటర్ నుంచి పోటీ ఎదురైనా ధనుశ్ 1.3 పాయింట్ల తేడాతో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ఈవెంట్లోనూ ధనుశ్ రజత పతకం సాధించాడు. ఓవరాల్గా భారత్ మూడు స్వర్ణాలు, 4 రజతాలు, రెండు కాంస్యాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.