ODI World Cup | వన్డే క్రికెట్ ప్రభ మసక బారుతున్నది. క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో ప్రపంచకప్ తొలి పోరుకు స్టాండ్స్ ఖాళీగా దర్శనమివ్వడమే దీనికి సంకేతమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ చూసేందుకు అభిమానులు మైదానాలకు రాకపోగా.. వర్షాలే అందుకు ప్రధాన కారణమని క్రీడా పాలకులు సర్ది చెప్పుకున్నారు. కానీ.. పొట్టి ఫార్మాట్ జోరులో.. మెల్లగా వన్డే క్రికెట్పై అభిమానుల్లో ఆసక్తి సన్నగిల్లుతూ వస్తున్నదనేది కాదనలేని వాస్తవం. అంతర్జాతీయ టీ20లతో పాటు.. విశ్వవ్యాప్తంగా వేర్వేరు లీగ్లు పుట్టుకొస్తుండగా.. ఆటలో వేగం పెరగడంతో పాటు.. అభిమానుల్లో సహనం తగ్గిపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భారత్తో ఒక్కసిరీస్ ఆడితే చాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరవచ్చు అని ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులు చకోర పక్షుల్లా చూస్తున్న తరుణంలో వన్డే ప్రపంచకప్ ఆరంభ పోరు బీసీసీఐని షాక్కు గురిచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన తొలి పోరుకు పట్టుమని పది వేల మంది కూడా హాజరు కాలేదు. సుమారు లక్షా 20 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో కనీసం 10 శాతం సీట్లు కూడా నిండలేదు. దీంతో మైదానంలో ఆడుతున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్తో పాటు.. కామెంటేటర్లు, నిర్వాహకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అహ్మదాబాద్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్లే ఫ్యాన్స్ తొలి మ్యాచ్పై అంతగా ఆసక్తి చూపలేదని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెగాటోర్నీ ఆరంభానికి ముందు కనీస వేడుకలు కూడా నిర్వహించకపోవడం వల్లే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కలగలేదని అంటున్నారు.