భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిరీస్లో అతనికి అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో గాయపడిన రుతురాజ్ స్థానంలో ఓపెనింగ్కు వచ్చిన అతను రాణించాడు.
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ (3) అవుటవగానే వచ్చిన అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. అతనికి మంచి సహకారం అందించిన సంజూ శాంసన్ (77) కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తన కెరీర్లో భారత్ తరఫున తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీళ్లిద్దరూ ఏకంగా 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దినేష్ కార్తీక్ (0), అక్షర్ పటేల్ (0), హర్షల్ పటేల్ (0) ముగ్గురూ గోల్డెన్ డక్లుగా పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా (15 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయాడు.
భారత జట్టు చివరి మూడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 3 వికెట్లు తీసుకోగా.. జోష్ లిటిల్, క్రెగ్ యంగ్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.