Iraq Footballer: మైదానంలో దురుసు ప్రవర్తన ఒక ఫుట్బాలర్ కొంప ముంచింది. ఏకంగా రెండేళ్ల నిషేధానికి గురయ్యేలా చేసింది. అతని పేరు ఇబ్రహీం బయేష్(Ibrahim Bayesh) .. ఇరాక్ దేశంలోని అల్-కవా-ల్-జవియా క్లబ్(Al-Quwa Al-Jawiya) కు చెందిన మిడ్ ఫీల్డర్. మ్యాచ్ సందర్భంగా తనకు రెడ్ కార్డు ఇచ్చినందుకు అవేశంతో అతను రిఫరీపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇరాక్ ఫుట్బాల్ సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇబ్రహీంపై రెండేళ్ల బ్యాన్ విధించింది.
‘రిఫరీ మొదటగా ఇబ్రహీంకి ఎల్లో కార్డు చూపించాడు. దాంతో, అతను కోపంగా వెళ్లి రిఫరీని చుట్టుముట్టాడు. అనంతరం రెడ్ కార్డు చూపించగానే ఇబ్రహీం ఆవేశంతో ఊగిపోయాడు. పరుగెత్తుతూ వెళ్లి రిఫరీపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు ఇబ్రహీం.. రిఫరీని అవమానించడమే కాకుండా అతడిని బెదిరించాడు’ అని అసోసియేషన్ వెల్లడించింది.
ఆల్ షాబ్(Al Shaad) స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో అల్-కవా-ల్-జవియాపై 3-2తో అల్- కహ్రబ క్లబ్ విజయం సాధించింది. అయితే.. అల్-కవా-ల్-జవియా క్లబ్ ఓటమి తట్టుకోలేని ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. స్టేడియంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని కూడా ఇరాక్ ఫుట్బాల్ సీరియస్గా తీసుకుంది. ఆ క్లబ్ ఆడే తర్వాతి మూడు మ్యాచ్లకు అభిమానులను అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. 10 మిలియమన్ ఇరాకీ దినార్ల(రూ.6 లక్షలు) జరిమానా కూడా విధించింది. అంతేకాదు స్టేడియం ఫర్నీచర్ మరమ్మతు ఖర్చులను చెల్లించాల్సిందిగా క్లబ్ను ఆదేశించింది.