చెన్నై: ఐపీఎల్(IPL)లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ను దాదాపు విక్టరీ వరకు తీసుకువెళ్లాడు ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మిస్టర్ కూల్ గురించి ఓ ఆందోళనకరమైన వార్తను ఆ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming ) చెప్పాడు. మోకాలి గాయంతో ధోనీ బాధపడుతున్నట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్లెమింగ్ మీడియా కాన్ఫరెన్స్లో వెల్లడించాడు. నిజానికి చివరి ఓవర్లో 21 రన్స్ కావాలి. అయితే ఆ ఓవర్లో ధోనీ(Dhoni) రెండు సిక్సర్లు కొట్టాడు. ఇక చివరి బంతికి 5 రన్స్ కావాలి, అప్పుడు ధోనీ కేవలం రెండు రన్స్ మాత్రమే తీశాడు. దీంతో రాజస్థాన్ జట్టు మూడు రన్స్ తేడాతో నెగ్గింది.
ఈ మ్యాచ్లో ధోనీ 17 బంతుల్లో 32 రన్స్ చేశాడు. దీంట్లో ఓ బౌండరీ, మూడు సిక్సర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజాతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జడేజా 15 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ధోనీకి మోకాలి నొప్పి ఉన్నా.. అతను అద్భుతంగా ఆడినట్లు ఫ్లెమింగ్ అన్నాడు. ధోనీకి మోకాలి సమస్యలు ఉన్న విషయం అతని కదలికల్లో గుర్తించవచ్చు అన్నారు. ఏదో సమస్య అతన్ని వెంటాడుతున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ విషయంలో అతను ప్రొఫెషనల్ అని, టోర్నీ స్టార్ట్ కావడానికి నెల ముందే అతను జట్టుతో కలుస్తాడని, అతనిపై తమకు ఏమీ డౌట్స్ లేవని, అద్బుతమైన ఆటగాడు అని ఫ్లెమింగ్ తెలిపాడు.
ధోనీకి మోకాలి గాయం ఉన్నా.. అతను రాబోయే మ్యాచ్లను ఆడుతాడా లేదన్న విషయం ఇంకా తెలియదు. దీనిపై ఫ్లెమింగ్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఆ జట్టుకు ఇప్పటికే పేసర్ సిసిండా మగాలా దూరం అయ్యాడు. బౌలర్ మగాలా చేతికి గాయమైనట్లు చెప్పాడు.