ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిది మరింత పెరగనున్నది. ఇప్పటికే రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ లో 74 మ్యాచులాడుతున్న పది జట్లు.. రాబోయే సీజన్లలో మరిన్ని ఎక్కువ మ్యాచులు ఆడనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. 2023-2027కు సంబంధించి మ్యాచుల సంఖ్యను గణనీయంగా పెంచనున్నది.
క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. 2023-2027 సైకిల్ కు గాను మొత్తం మ్యాచుల సంఖ్యను 400 (410 అని అంచనా) కు పైగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఒక సీజన్ లో 74 మ్యాచులను నిర్వహిస్తున్నారు. లీగ్ లో 70.. ప్లేఆఫ్స్, ఫైనల్స్ కలిపి 74 మ్యాచులు జరుగుతున్నాయి. కానీ 2025 సీజన్ నుంచి మ్యాచుల సంఖ్య రిగే అవకాశముంది.
వచ్చే ఐదేండ్ల సైకిల్ లో తొలి రెండు సీజన్లను ఎప్పటిలాగే 74 మ్యాచులు నిర్వహించనున్న బీసీసీఐ.. 2025 నుంచి మాత్రం వాటిని 84 కు పెంచనున్నది. ఆ తర్వాత ఏడాది కూడా ఇన్నే మ్యాచులను నిర్వహిస్తారు. కానీ 2027 సీజన్ లో మాత్రం వాటిని 94 కు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్లు వేసిన బిడ్డర్స్ కు కూడా బీసీసీఐ ఈ సమాచారం అందించినట్టు తెలుస్తున్నది. బిడ్ వేసిన పలువురు బడా బాబులు కూడా దీనిని దృష్టిలో ఉంచుకునే వేలం లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఈనెల 12న మీడియా హక్కుల వేలానికి సంబంధించిన ప్రక్రియ జరగాల్సి ఉంది.
ఐపీఎల్ లో ఈ సీజన్ నుంచి రెండు కొత్త జట్లు రావడంతో ఆట, వినోదం మరింత పెరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా మ్యాచుల సంఖ్యను పెంచాలని గతంలో వాదనలు వినిపించాయి. వీటికి తోడు కొద్దిరోజులుగా ఐపీఎల్ లో ఒకే ఏడాది రెండు సీజన్లు (70 +70.. 140 మ్యాచులు) ఆడించాలని చర్చ నడుస్తున్నది. టీమిండియా మాజీ హెచ్ కోచ్ రవిశాస్త్రి ఇటీవలే ఈ ప్రతిపాదన చేశాడు. తాజా పరిణామాలు చూస్తుంటే బీసీసీఐ కూడా ఇదే దిశగా సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ సైకిల్ లో కాకున్నా వచ్చే సైకిల్ లో అయినా బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేయాల్సిందే అంటున్నారు క్రికెట్ విశ్లషకులు.