ఐపీఎల్ను కరోనా కాటేసింది. మహమ్మారి దెబ్బకు టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. బయోబబుల్లోని మరో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో 14వ సీజన్ను బీసీసీఐ తక్షణమే నిలిపివేసింది. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉండడం.. అన్ని జట్లు క్వారంటైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో టోర్నీ కొనసాగించడం క్షేమం కాదని నిశ్చయించుకుంది. ఇక విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు ఎలా చేర్చాలనే ఆలోచనలో పడింది. ఈ సీజన్లో 60 మ్యాచ్లకు గాను 29 మ్యాచ్లు జరుగగా.. వాయిదా పడిన టోర్నీ ఇప్పట్లో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
న్యూఢిల్లీ: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనా పంజా విసిరింది. క్రికెట్ పండుగను అర్ధాంతరంగా ఆపేసింది. 48 గంటల వ్యవధిలో బయోబబుల్లోని నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా పాజిటివ్గా తేలడంతో మంగళవారం బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి అత్యవసరంగా భేటీ అయ్యాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో తక్షణమే టోర్నీని నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి. ‘ఆటగాళ్లు, సిబ్బంది, టోర్నీలో భాగమైన అందరి రక్షణ, సంక్షేమంలో బీసీసీఐ రాజీ పడదు. అందరి ఆరోగ్యం, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ వెల్లడించింది.
రెండు రోజుల వ్యవధిలో బయటపడిన కరోనా కేసులతో ఐపీఎల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తొలుత కోల్కతా ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ మహమ్మారి బారిన పడినట్టు తేలగా.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ బాలాజీతో పాటు ఆ బృందంలో మరొకరికి పాజిటివ్ రావడంతో సోమవారం మ్యాచ్ వాయిదా పడింది. తాజాగా మంగళవారం హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా, చెన్నై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. మిగిలిన అన్ని మ్యాచ్లను ముంబైలో నిర్వహిద్దామని తొలుత బోర్డు ఆలోచించినా.. ఇక సాధ్యం కాదని నిశ్చయించుకుంది.
వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ మళ్లీ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. విదేశీ ఆటగాళ్లను సైతం వారి దేశాలకు పంపేందుకు బీసీసీఐ నిర్ణయించడంతో అసలు 14వ సీజన్ మళ్లీ జరుగుతుందా అన్న అనుమానాలు రేగుతున్నాయి. ‘టోర్నీని నిరవధికంగా వాయిదా వేశాం. తర్వాత వీలైన సమయంలో నిర్వహిస్తాం. అయితే ఈ నెలలో మాత్రం కాదు’అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ చెప్పారు.
విదేశీ ప్లేయర్లను సురక్షితంగా వారి దేశాలకు పంపుతామని బీసీసీఐ పేర్కొంది. వారిని ఇండ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ చెప్పారు. ఐపీఎల్లో ఇంగ్లండ్ (11), ఆస్ట్రేలియా (14), దక్షిణాఫ్రికా (11), న్యూజిలాండ్ (10), వెస్టిండీస్ (9)తో పాటు ఆఫ్ఘనిస్థాన్ (3), బంగ్లాదేశ్ (2) ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఇక్కడ క్వారంటైన్ పూర్తయ్యాక టీమ్ఇండియాతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు వెళ్లే అవకాశం ఉంది. అలాగే మిగిలిన దేశాల బోర్డులతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ యోచిస్తున్నది.
ఐపీఎల్ను వాయిదా వేయడంతో బీసీసీఐకి రూ.2 వేల కోట్ల నష్టం రానుంది. సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. అలాగే అన్ని ఫ్రాంచైజీలకు దాదాపు రూ.వెయ్యి కోట్ల నష్టం రానుంది. టోర్నీ మధ్యలో నిలిచిపోవడంతో రూ.2వేల నుంచి రూ.2,500 కోట్ల ఆదాయం తగ్గనుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. 52 రోజుల పాటు 60 మ్యాచ్లు జరుగాల్సిన 14వ సీజన్లో 29 మ్యాచ్లే జరిగాయి.
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్లో జరుగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెగాటోర్నీ యూఏఈకి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. బీసీసీఐ కూడా పొట్టి ప్రపంచకప్ను నవంబర్లో యూఏఈ వేదికగానే జరుపాలని ఆలోచిస్తున్నదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో భారత్లో కరోనా మూడో వేవ్కు చేరే అవకాశం కూడా ఉండటంతో బీసీసీఐ.. యూఏఈ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. మరోవైపు పరిస్థితులు సద్దుమణిగితే సెప్టెంబర్లో ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్లు నిర్వహించి.. భారత్లోనే ప్రపంచకప్నకు బీసీసీఐ సన్నాహకాలు చేసుకుంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
కరోనా ఉద్ధృతి ఉన్నా యూఏఈలో నిర్వహించిన గతేడాది ఐపీఎల్ విజయవంతంగా సాగింది. బ్రిటన్కు చెందిన ఓ సంస్థ అక్కడి బయోబబుల్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించగా.. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సీజన్ మొత్తం సాగింది. అయితే ఈ ఏడాది బయోబబుల్ ఏర్పాట్లను బీసీసీఐ స్వయంగా చేపట్టింది. అయితే ఈ ఏర్పాట్లలో లోపాల వల్లనే టోర్నీకి ముప్పు వాటిల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైదానాల్లో పని చేసే సిబ్బందికి బీసీసీఐ అధికారులతో కాకుండా వేరుగా బబుల్ ఏర్పాటు చేయడం, వారి కదలికలను సరిగా కనిపెట్టకపోవడం.. ప్రాక్టీస్ చేసే సమయాల్లో మైదానం సిబ్బంది పిచ్లను తయారు చేయడం సహా మిగిలిన పనుల కోసం ఆటగాళ్ల సమీపంలోనే తిరిగారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై స్టేడియాల్లో సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు తేలగా.. బబుల్లో ఈ విధంగానూ వైరస్ ప్రవేశించి ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ఆటగాళ్లకు ఇచ్చిన జీపీఎస్ ట్రాకింగ్ బ్యాండ్లు కూడా సరిగా పని చేయలేదనే అనుమానాలు తలెత్తాయి. చెన్నైకు చెందిన ఓ సంస్థ రూపొందించిన ఈ బ్యాండ్లు ఆటగాళ్లు కదలికలను సరిగా గుర్తించలేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆటగాళ్లు ఓ నగరం నుంచి మరొకచోటికి వెళ్లే సమయంలో వివరాలను బ్యాండ్లు సరిగా రికార్డు చేయలేదట.