బీసీసీఐకి బంగారు బాతులా దొరికిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ నానాటికీ పెరుగుతున్నది. ఇప్పటికే మీడియా రైట్స్, ప్రమోటర్లు, బ్రాండ్ వాల్యూ విషయంలో సీజన్ కో రికార్డు సృష్టిస్తున్న ఐపీఎల్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో జరుగబోయే ఒక్కో మ్యాచ్ విలువ సుమారు రూ. 100 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. ఇదే జరిగితే ప్రముఖ ఫుట్బాల్ లీగ్ ‘ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్’ను ఐపీఎల్ అధిగమించినట్టే..
2023-27 సీజన్ కు గాను బీసీసీఐ ఐపీఎల్ మీడియా హక్కులను రూ. 32,890 కోట్లను బేస్ ప్రైజ్ (కనీస ధర) గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఒక్కో మ్యాచ్ కు టీవీ రైట్స్ ద్వారా కనీస ధరగా రూ. 49 కోట్లు దక్కనున్నాయి. డిజిటల్ రైట్స్ కోసం రూ. 33 కోట్లుగా నిర్ణయించినట్టు సమాచారం.
ఇదే విషయమై స్పోర్ట్సీ సొల్యూషన్స్ సీఈవో ఆశిశ్ చద్దా మాట్లాడుతూ.. ‘వచ్చే సీజన్ లో ఒక్క మ్యాచ్ కోసం కనీస ధర లో 20-25 శాతం పెరుగుదల ఉండొచ్చు. కానీ డిజిటల్ రైట్స్ ప్యాకేజీలో మాత్రం భారీగా పెరుగుదల కనిపించే అవకాశమున్నది. వీటన్నింటి వల్ల రాబోయే సీజన్ లో ఒక్కో మ్యాచ్ విలువ సుమారు రూ. 115 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్యలో ఉండనుంది’ అని తెలిపాడు.
ప్రస్తుతానికి అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఒక్కో మ్యాచ్ విలువ రూ. 134 కోట్లు గా ఉంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో ఒక మ్యాచ్ విలువ రూ. 81 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో ఐపీఎల్ లో ప్రస్తుతం మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉంది. కానీ వచ్చే ఏడాది నుంచి అది వంద కోట్ల రూపాయలు దాటనుంది. దీంతో ఎన్ఎఫ్ఎల్ తర్వాత ఐపీఎల్ రెండో స్థానంలో నిలిచే అవకాశముంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 స్పోర్ట్స్ లీగ్ లు :
– నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)
– ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)
– మేజర్ లీగ్ బేస్బాల్ (ఎంఎల్బీ)
– ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
– బుండెస్లిగ (బుండెస్లిగ- ఇదొక ఫుట్బాల్ లీగ్)